ఆ ముగ్గురి ఆడియో టేపుల… మ్యాటరేంటి… ?

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ రాజకీయ సమీకరణలు మాత్రం వేగంగా మారుతున్నాయి. ప్రతీ ఎన్నికకూ కొన్ని వర్గాలు ఆశగా ముందుకు వస్తాయి. ఈసారి [more]

Update: 2021-08-23 05:00 GMT

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ రాజకీయ సమీకరణలు మాత్రం వేగంగా మారుతున్నాయి. ప్రతీ ఎన్నికకూ కొన్ని వర్గాలు ఆశగా ముందుకు వస్తాయి. ఈసారి మేమే అంటూ కూడా గట్టిగా చెప్పుకుంటాయి. అయితే ఏపీలో రెండే రెండు పార్టీలుగా వ్యవహారం మారింది. అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లుగా పాలిటిక్స్ సాగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో కాపులు ఈ మధ్య కొంత అసహనంగా ఉన్నారని టాక్. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వారిని అదే పార్టీలో కొందరు టార్గెట్ చేస్తున్నారు అన్నదే చర్చగా ఉంది.

అందరూ వారేగా..?

వైసీపీ అధికారంలోకి వచ్చాక థర్టీ యియర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ ని రాస లీలల ఆడియో లీకులతో హడలెత్తించారు. ఆయన ప్రతిష్టాత్మకైన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇక అంబటి రాంబాబుకు ఇప్పటికి రెండు సార్లు ఇలాగే జరిగింది. ఇపుడు మంత్రి అవంతి శ్రీనివాస్ మీదన కూడా ఇదే దాడి సాగింది. వీరంతా ఒకే సామాజికవర్గం అని వేరేగా చెప్పాల్సింది లేదు. పైగా వీరి మీద ఈ రకంగా దాడులు చేస్తున్న వారు, చేయిస్తున్న వారు కూడా వైసీపీలోనే ఉన్నారని అనుమానిస్తున్నారు. వారు కూడా ఒకే సామాజికవర్గం వారు అని కూడా అంటున్నారు. మరి తమ మద్దతుతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో తమను బదనాం చేయడమేంటి అన్న చర్చ అయితే వాడిగా వేడిగా ఫ్యాన్ పార్టీలో సాగుతోందిట.

అదే వేదికగా..?

విశాఖ జిల్లా సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రెండవ కుమార్తె వివాహ నిశ్చితార్ధం విశాఖ సిటీలో తాజాగా జరిగింది. దానికి వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అటెండ్ అయ్యారు. ఆయనే అక్కడ ముఖ్య ఆకర్షణగా ఉన్నారు. వైసీపీ ద్వారా గెలిచిన కాపు ఎమ్మెల్యేలు నేతలు అంతా కలసి ఈ సందర్భంగా ముచ్చటించుకున్నారు అంటున్నారు. బొత్సతో కలసి తమ మనసులోని విషయాలను పంచుకున్నారని కూడా తెలుస్తోంది. బొత్స సైతం ఈ మధ్య అధినాయకత్వం పోకడల పట్ల కొంత ఆవేదన చెందుతున్నారు అన్న వార్తల నేపధ్యంలో అంతా కలవడం అంటే విశేషంగానే చెప్పుకోవాలి.

చిచ్చు రగలకముందే..?

కాపులకు ఒక పార్టీ ఉంది. పవన్ కులం లేదు అన్నా కూడా కాపు యువకులు చాలా మంది తమ సొంత పార్టీగానే భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉంది. కొంత అసంతృప్తి ఉండడం కూడా సహజమే. ఇక ఇపుడు సొంత పార్టీలోనే వర్గ విభేదాలతో తమను టార్గెట్ చేస్తున్నారు అని కాపులు భావిస్తే అది పెద్ద చిచ్చుగానే మారుతుంది. అది ముదిరి మంటలు వ్యాపించకుండానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చు అంటున్నారు. అందువల్ల అప్పటికి ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు లేకుండా చూసుకోకపోతే అవీ ఇవీ కలసి ఏకంగా కార్చిచ్చులాగ కూడా వ్యాపించి పార్టీకే ఇబ్బందిగా మారుతుంది అంటున్నారు. చూడాలి మరి దీని మీద హై కమాండ్ ఏం ఆలోచిస్తుందో.

Tags:    

Similar News