దీని భావమేమి విజయసాయీ… ?

ఏపీ అసెంబ్లీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ కచ్చితమైన తీర్మానం చేశారు. ఒక విధంగా ఇది కేంద్రంలోని మోడీ సర్కార్ కి గట్టి [more]

Update: 2021-06-04 08:00 GMT

ఏపీ అసెంబ్లీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ కచ్చితమైన తీర్మానం చేశారు. ఒక విధంగా ఇది కేంద్రంలోని మోడీ సర్కార్ కి గట్టి షాక్ లాంటిదే. ఈ తీర్మానం గురించి పట్టించుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పటిదాకా లేని విధంగా మోడీ ఆలోచనలకు భిన్నంగా జగన్ సర్కార్ ఒక వ్యతిరేక తీర్మానం ఆమోదించడం అంటే మోడీని ఇరకాటంలో పెట్టినట్లేనా అన్నదే పాయింట్. అయితే తమ చిత్తశుద్ధిని చాటుకోవడానికే తీర్మానం ఆమోదించామని వైసీపీ పెద్దలు చెప్పుకోవచ్చు. కానీ అవతల ఉన్నది మోడీ. ఆయనకు కూడా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలన్న చిత్తశుద్ధి చాలానే ఉంది మరి.

ఢిల్లీలో వినిపిస్తారా…?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అందుకే తమ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది అని ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. జగన్ మాట ఇచ్చారు కాబట్టి వెనక్కు తగ్గరు అన్న దానికి ఇది నిదర్శనమని కూడా చెబుతున్నారు. అలాగే తాము ఇక్కడితో ఈ పోరాటం ఆపమని, ఢిల్లీలో విశాఖ ఉక్కు గుండె చప్పుడు వినిపించేలా గట్టిగానే ఉద్యమిస్తామని అంటున్నారు. దాంతో అక్కడే సందేహాలు అనేకం పుట్టుకువస్తున్నాయి. జగన్ నేరుగా ఈ విషయంలో ప్రధాని మోడీని ఢీ కొడతారా అన్నదే చాలా మందికి అర్ధం కాని విషయంగా ఉంది. తీర్మానం ఆరంభమని విజయసాయిరెడ్డి అంటున్నారు అంటే చాలా భావాలకు అర్ధాలు వెతకాల్సి ఉంటుంది అంటున్నారు.

ధైర్యం వచ్చిందా :

తాజాగా అయిదు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత మోడీ క్రేజి తగ్గిందన్న సూచనలు వచ్చిన తరువాత వైసీపీలోనూ ధైర్యం వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటిదాక ప్రత్యేక హోదా విషయంలో పెద్దగా సౌండ్ చేయలేదు. విభజన హామీల విషయంలో కూడా ఎలాంటి డిమాండ్లూ డెడ్ లైన్లూ పెట్టలేదు. కానీ ఇపుడు విశాఖ ఉక్కు విషయంలో మాత్రం ఊరుకునేది లేదు అని అంటున్నారు అంటే కచ్చితంగా రాజకీయ లెక్కలు చూసుకునే ఉంటారనిపిస్తోంది. మోడీని ఈ టైంలో నిలదీసి ఏపీకి సంబంధించిన వాటిని సాధించుకోవాలన్న ఉద్దేశ్యం ఏదైనా వైసీపీ పెద్దలకు ఉంటే మాత్రం ఒక విధంగా ఇది రైట్ డెసిషన్ అని అంటున్నారు.

ప్రతిష్టగా ….

ఇక్కడ జగన్ ప్రతిష్ట కూడా ముడిపడి ఉంది అన్నదే పాయింట్. విశాఖను జగన్ బాగా ప్రేమిస్తున్నారు. ఒక విధంగా చూస్తే జగన్ సొంత జిల్లా కడప కాదు, విశాఖ మాత్రమే. ఆయన పరిపాలనా రాజధానిగా వైజాగ్ ని ప్రకటించారు. విశాఖలో ఉన్న ఏకైన భారీ పరిశ్రమ ఉక్కు కర్మాగారం. దాన్ని ప్రైవేట్ పరం చేసేశాక క్యాపిటల్ పెట్టి కూడా లాభం ఏముంది. జనాలు కూడా ఉన్నది పోయాక రాజధాని అంటే ఉక్కు నగరానికి ఆ రాజసం వస్తుందా అన్న ఆలోచన చేస్తారు కదా. అందుకే జగన్ కూడ ఉక్కుని గట్టిగానే పట్టుకున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఎందాకైనా అన్నట్లుగానే ప్రభుత్వ తీరు ఉందని కూడా చెబుతున్నారు. మరి జగన్ ఇంత పట్టుదల మీద ఉంటే మోడీ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్న దాని మీదనే రెండు పార్టీల రాజకీయ సమరం ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News