అశోక్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు…. ?

విజయనగరం జిల్లా మహారాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వర్సెస్ వైసీపీ కధ క్లైమాక్స్ చేరేలా కనిపిస్తోంది. తాము గద్దె దింపితే కోర్టు ఆదేశాలతో మరో [more]

Update: 2021-07-01 08:00 GMT

విజయనగరం జిల్లా మహారాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వర్సెస్ వైసీపీ కధ క్లైమాక్స్ చేరేలా కనిపిస్తోంది. తాము గద్దె దింపితే కోర్టు ఆదేశాలతో మరో మారు మాన్సాస్ చైర్మన్ గిరీని సంపాదించిన అశోక్ గజపతిరాజు అంటే వైసీపీకి మండుకువస్తోంది. దాంతో ఆయన్ని ఎలాగైనా ఇరికించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇపుడు ఒక కొలిక్కి వచ్చాయని అంటున్నారు. అశోక్ గజపతిరాజు మాన్సాస్ చైర్మన్ గా ఉండగా అనేక అవకతవకలు జరిగాయని ఇప్పటిదాకా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇపుడు వాటికి ఆధారాలను కూడా రెడీ చేస్తున్నారు.

ఆ భూములు గాయబ్…?

సింహాచలం దేవస్థానికి దాదాపుగా పదివేల ఎకరాల భూమి ఉంది. ఇందులో నుంచి ఏకంగా 748 ఎకరారాల భూమిని తొలగించడం ఇపుడు పెద్ద వివాదం అవుతోంది. ఈ 22ఏ జాబితా నుంచి 2017లో తొలగించడంతో ఇది పెద్ద వివాదంగా మారుతోంది. ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం చూస్తే పది వేల కోట్ల రూపాయలుగా ఉంటుంది. మరి ఇలా తొలగించిన భూములు ఏం చేశారు, ఎవరికి అప్పగించారు అన్న దాని మీద దర్యాప్తు జరుగుతోంది. ఆ టైమ్ లో సింహాచలం ఆలయ ఈవోగా కె రామచంద్రమోహన్ పనిచేశారు. తాజాగా ఆయన మీద అభియోగాలు మోపుతూ దేవాదాయ శాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసింది.

పక్కా ఆధారాలతోనే …?

ఇక ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించి అసలు విషయాలు బయటపెడతామని వైసీపీ నేతలు అంటున్నారు. అంతే కాదు మాన్సాస్ ట్రస్ట్ లో కూడా భూములు చాలా అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపిస్తున్నారు. వీటన్నింటి మీద ఒక అవగాహనకు వచ్చిన తరువాత బాధ్యుల మీద చర్యలు ఉంటాయని అంటున్నారు. నిజానికి కె రామచంద్రమోహన్ ఇక్కడ ఒక పావు మాత్రమే అంటున్నారు. ఆయన్ని ముందు పెట్టి అశోక్ గజపతిరాజు మెడకు ఉచ్చు బిగించేలా ఈ దర్యాప్తు ఉంటుంది అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.

అది నిజమేనా…?

ఇంతకీ అశోక్ గజపతిరాజు మీద ఎందుకు కక్ష. ఆయన ఏం చేశారు అంటే జగన్ మీద అప్పట్లో సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ తరఫున ఎర్రన్నాయుడుతో పాటు అశోక్ గజపతిరాజు కూడా ఇంప్లీడ్ అయ్యారు. జగన్ ని జైలుపాలు చేయడానికి కారకుడిగా ఆయన ఉన్నారన్నది వైసీపీ మండిపాటు అని చెబుతారు. ఇక దానికి తోడు ఆయన చంద్రబాబుకు సన్నిహితుడుగా ఉండడంతో ఆయన్ని దెబ్బ తీయాలన్న పట్టుదల కూడా కనిపిస్తోందిట. ఎటూ విశాఖ పాలనారాజధాని అవుతుంది కాబట్టి తమ హవా సాగాలన్నది కూడా మరో ఆలోచన. మొత్తానికి అటు సింహాచలం, ఇటు మాన్సాస్ భూములతో మొదలైన ఈ రచ్చ రాజకీయ కక్షలకు దారితీసేలా ఉందని అంటున్నారు. అశోక్ గజపతిరాజు ఎప్పటికైనా జైలుకి వెళ్ళక తప్పదు అంటూ విజయసాయిరెడ్డి ఆ మధ్య చేసిన కామెంట్స్ ని గుర్తుకు తెచ్చుకుంటే మాత్రం కచ్చితంగా వైసీపీ ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతోంది అనిపిస్తోంది.

Tags:    

Similar News