అశోక్ ని అంటే శోకమే సుమా ?

విజయన‌గరం రాజావారుగా పూసపాటి అశోక్ గజపతిరాజుకు పేరుంది. ఆయన తండ్రి, తాత ముత్తాతలు మొత్తం విజయనగరం విశాఖ నగరాలను కలిపి పాలించారని చరిత్ర చెబుతోంది. ఈ రెండు [more]

Update: 2021-01-11 12:30 GMT

విజయన‌గరం రాజావారుగా పూసపాటి అశోక్ గజపతిరాజుకు పేరుంది. ఆయన తండ్రి, తాత ముత్తాతలు మొత్తం విజయనగరం విశాఖ నగరాలను కలిపి పాలించారని చరిత్ర చెబుతోంది. ఈ రెండు జిల్లాల్లో ఏ ప్రాంతం చూసిన రాజుల కాలం నాటి ఆనవాళ్ళు ఉంటాయి. వేల ఎకరాల భూములను వారు దారాధత్తం చేశారు. పేదల కోసం నిలిచారు. సేవా భావంతో పనిచేశారు. పూసపాటి రాజులు అంటే జనాలకు గౌరవంతో కూడిన భక్తి. వారి మీద గెలిచిన వారు సైతం గట్టిగా ఏనాడూ వారిని దూషించి ఎరుగరు. అటువంటి పూసపాటి రాజుల విషయంలో కొందరు వైసీపీ మంత్రులు చేస్తున్న హాట్ కామెంట్స్ చివరికి ఫ్యాన్ పార్టీకే పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయని అంటున్నారు.

అసభ్య దూషణలతో ….

విజయనగరం జిల్లాలోని రామతీర్ధాలు ఆలయానికి ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆయన్ని ఆ పదవి నుంచి హఠాత్తుగా తొలగించారు. దీని మీద మీడియా అడిగిన ప్రశ్నకు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పిన జవాబు ఆస్థిక జనులతో పాటు పూసపాటి వారిని అభిమానించే విజయన‌గరం జిల్లా వాసులను కూడా నివ్వేరపోయేలా చేస్తోంది. అశోక్ గజపతిరాజు ని అసభ్య పదజాలంతో మంత్రి దూషించడమే కాకుండా ఆయన వల్లనే శ్రీరాముడి విగ్రహం ద్వంసం అయింది అని విమర్శించారు. నిజానిజాలు ఎలా ఉన్నా కూడా అశోక్ గజపతిరాజు ఈ పని చేశారు అంటే జనాలు అసలు నమ్మరు. ఎన్నో వేల దేవాలయాలకు పోషకులుగా ఉన్న విజయనగరం పూసపాటి వంశీకుల మీద మంత్రి నోరు పారేసుకోవడం ద్వారా వైసీపీకి చేటు తెస్తున్నాను అన్న సంగతిని కూడా మరచిపోతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చిరిగి చేట అయితే ….

ఇప్పటికే ఏ మాత్రం అనుభవం లేని సంచయిత గజపతిరాజుని మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ ని వైసీపీ చేసి రోజుకొక తలనొప్పిని తెచ్చుకుంటోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటి ఫలితాలు, పర్యవశానాలు మాత్రం వైసీపీ సర్కార్ మీదనే వస్తాయని అంతా అంటున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన విజయనగరం మహరాజా కళాశాలను ప్రైవైట్ పరం చేయడం, ఏకంగా మాన్సాస్ ఆఫీస్ ని రాజుల కోట నుంచి విశాఖకు తరలించడం వంటి సంచయిత నిర్ణయాలు సంచలనమే రేపుతున్నాయి. ఇవన్నీ చిరిగి చేట అయితే రాజకీయంగా వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.

జగన్ ఇమేజ్ కే ….

ఒక్క జగన్ తప్ప వైసీపీలో అందరూ పెద్ద నోళ్ళు చేస్తారు. గట్టిగా మాట్లాడుతారు. బూతుల మంత్రులు అంటూ జనాలే కొందరికి పేర్లు పెట్టారు. మరి అటువంటి మంత్రులను అదుపు చేయకపోతే అల్టిమేట్ గా జగన్ ఇమేజ్ కే డ్యామేజ్ అవుతుంది అన్న చర్చ అయితే ఉంది. జగన్ కి విజయనగరం జిల్లా అంతా ఒక్కటిగా నిలిచి మొత్తం ఓట్లూ సీట్లూ కట్టబెట్టింది. అటువంటి చోట వచ్చిన జనాదరణను మరింత పటిష్టం చేసుకుని శాశ్వతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. కానీ ఇలా పదే పదే అశోక్ గజపతిరాజు మీద బాణాలు వేసి మహారాజ వంశీకులను అవమానిస్తే అది వైసీపీకి రాజకీయంగా దెబ్బ అవుతుంది అంటున్నారు.

Tags:    

Similar News