అశోక్ అన్నా గతం మర్చిపోయావా?

మాజీ ఉద్యోగ సంఘాల నేత, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబుకు తన గతం గుర్తుకు లేదులా ఉంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలపై ఆయనే [more]

Update: 2021-01-23 11:00 GMT

మాజీ ఉద్యోగ సంఘాల నేత, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబుకు తన గతం గుర్తుకు లేదులా ఉంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలపై ఆయనే విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘం నేతగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన అశోక్ బాబుకు ఏపీ ఎన్జీవోలను విమర్శించే హక్కులేదంటున్నారు. ఉద్యోగుల హక్కులను అశోక్ బాబు మరచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారో చెప్పాలని ఏపీ ఉద్యోగ సంఘ నేతలు నిలదీస్తున్నారు.

ఆ ఉద్యమాన్ని…..

సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. అయితే ఉద్యమం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగకపోయినా ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబుకు మాత్రం అచ్చి వచ్చినట్లే చెప్పాలి. 2014 వరకూ ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆయన ఉద్యోగ సంఘ నేతగానే ఉన్నారు. అయితే ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

బాబుకు సహకరించి…..

అప్పట్లో చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల నేతగా అశోక్ బాబు సహకరించారు. రాష్ట్రం విడిపోయి, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉన్నప్పటికీ చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని అమరావతికి బయలుదేరారు. ఆ సమయంలో ఉద్యోగులు అమరావతికి తరలి రావడానికి అశోక్ బాబు సహకరించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగినప్పుడు కూడా ఆయనకు ఉద్యోగుల ప్రయోజనాల కంటే పార్టీ, ప్రభుత్వం వైపే మొగ్గు చూపారు.

ఇప్పడు ఉద్యోగ సంఘాల నేతలపై….

ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ అదే జరుగుతుంది. కరోనా సమయంలో ఎన్నికలకు వెళ్లలేమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కానీ అశోక్ బాబు మాత్రం ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వ తొత్తులుగా విమర్శించారు. కరోనాతో ఉద్యోగులు మరణించిన విషయాన్ని అశోక్ బాబు మర్చిపోయారు. అందుకే ఉద్యోగ సంఘాల నేతలు కూడా అశోక్ బాబుకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తమను విమర్శించే అర్హత ఆయనకు లేదని, రాజకీయ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని సూచించారు. ఇప్పటికైనా అశోక్ బాబు గురివింద గుంజ సామెతను గుర్తు చేసుకుంటే మంచిదేమో?

Tags:    

Similar News