కేజ్రీవాల్ ను డమ్మీని చేసినట్లేనా?

భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎవరినీ కుదురుగా ఉండనీయదు. మొన్నటి వరకూ పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామిని మూడు చెరువుల నీళ్లు తాగించింది. అప్పటి [more]

Update: 2021-04-11 18:29 GMT

భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎవరినీ కుదురుగా ఉండనీయదు. మొన్నటి వరకూ పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామిని మూడు చెరువుల నీళ్లు తాగించింది. అప్పటి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఇప్పుడు బీజేపీ కన్ను కేజ్రీవాల్ పై పడింది. కేజ్రీవాల్ ను సక్రమంగా పాలన చేేసుకోనివ్వకుండా లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అధికారాలను కట్టబెడుతూ సవరణ బిల్లు తెచ్చింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.

ఆకాంక్ష నెరవేరకపోవడంతో….

బీజేపీకి దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాగా వేయాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. మూడు ఎన్నికల నుంచి కేజ్రీవాల్ అడ్డుపడుతున్నారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సయితం వివిధ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున అభ్యర్థులను పోటీకి దింపుతున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేజ్రీవాల్ వ్యతిరేకస్తున్నారు. మూడు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న రైతులకు కేజ్రీవాల్ మద్దతు తెలిపారు.

ఆయనకే పూర్తి అధికారాలు…

ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బతగిలింది. దీంతో కేజ్రీవాల్ ను కట్టడి చేయాలని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్డెనెన్స్ ను తీసుకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటోరి ఆఫ్ ఢిల్లీ బిల్లుకు సవరణ చేస్తూ ఉభయ సభల్లో ఆమోదించు కుంది. రాజ్యసభలో విపక్షాలు కొంత ప్రతిఘటించినా బిల్లు ఆమోదం పొందింది. చివరకు రాష్ట్రపతి సయితం ఈ బిల్లును ఆమోదించడంతో కేజ్రీవాల్ కంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్ట్ నెంట్ గవర్నర్ బలంగా మారారు.

ఏ నిర్ణయం తీసుకోవాలన్నా….

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఇక విలువ ఉండదు. కేజ్రీవాల్ ఇకపై తీసుకునే అన్ని నిర్ణయాలు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్ అనుమతి తర్వాతనే అసెంబ్లీలో కేజ్రీవాల్ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ నుంచి అధికారాలను లాగేసుకునేందుకే బీజేపీ ఈ రకమైన బిల్లును తెచ్చిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీనిపై కేజ్రీవాల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న కేజ్రీవాల్ కంటే లెఫ్ట్ నెంట్ గవర్నర్ బలవంతుడిగా మారారు. ఈ బిల్లుతో బీజేపీ ప్రజల్లో మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంది.

Tags:    

Similar News