ఖలేజా ఉన్న కేజ్రీ…!!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను చాలాసార్లు చూశాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతినుంచి పోటీ చేశారు. అంతకుముందు [more]

Update: 2019-04-29 17:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను చాలాసార్లు చూశాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతినుంచి పోటీ చేశారు. అంతకుముందు ఎన్టీరామారావు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించి రెండు స్థానాల్లో పోటీ చేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లాలోని గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే ఓటమి భయంతో కాకపోయినా ఆ ప్రాంతంలో పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తే ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతుందని కావచ్చు. కానీ వీరెవ్వరూ సీఎం అభ్యర్థులపైన గాని, పేరున్న నేతలపైన గాని అప్పుడూ, ఇప్పుడు పోటీ చేయలేదు.

గట్స్ ఉన్న లీడర్….

కాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తీసుకుంటే ఆయన ఖలేజా ఉన్న నేతగా చెప్పాల్సిందే. అందుకు అందరూ అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఆయనకు ఎటువంటి ఇమేజ్ లేదు. క్రేజ్ లేదు. కేవలం ఐఆర్ఎస్ అధికారిగా ఉంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఆమ్ ఆద్మీపార్టీని స్థాపించారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ తాను ఏమాత్రం భయపడలేదు. 2013 డిసెంబరు లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆయనతొలిసారి పోటీకి దిగింది ఎవరిమీదో కాదు. అప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పై పోటీ చేసి సంచలన విజయం సాధించారు. గట్స్ అంటే అలా ఉండాలి. అప్పటి నుంచే కేజ్రీవాల్ క్రేజ్ పెరిగిపోయింది.

సీఎం పదవికి రాజీనామా చేసి….

అయితే ఎక్కువ సీట్లు ఆ ఎన్నికల్లో సాధించుకున్నప్పటికీ అధికారంలోకి వచ్చేందుకు మ్యాజిక్ ఫిగర్ ను సాధింలేకపోయారు. కాంగ్రెస్ సహకారంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో అరవింద్ కేజ్రీవాల్ తనపదవికి రాజీనామాచేశారు. 2015 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి అఖండ మెజారిటీతో తిరిగి ఢిల్లీ పీఠాన్ని ఎక్కారు. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు గాను 67 సీట్లు సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. గత లోక్ సభ ఎన్నికల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇలా కేజ్రీవాల్ ఎవరిపైనేనా పోటీ చేసేందుకు వెనుకాడకపోవడం ఆయనకు ఆయనపైనా, పార్టీపైనా,ప్రజలపైనాఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లోనూ….

తాజాగా లోక్ సభ ఎన్నికల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ ఒంటరిగానే ఢిల్లీలో బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందామనుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అయినా ప్రధాన శత్రువు మోదీ కాబట్టి ఆయనను ఓడించే లక్ష్యంతోనే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ కలసి రాకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగారు. ఇలా ప్రతి రాజకీయ నేత అరవింద్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయనకున్న మొండిధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రస్తుతమున్న ఏ రాజకీయనేతకూ లేదనే చెప్పాలి. రేపులోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా అరవింద్ కేజ్రీవాల్ కీ రోల్ గా మారతారన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం.

Tags:    

Similar News