ప్రజావేదిక రచ్చ రచ్చ …

ప్రభుత్వ డబ్బుతో అమరావతిలో కట్టిన ప్రజావేదిక కేంద్రం గా రచ్చ రచ్చ మొదలైపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇది తమకు అప్పగించాలంటూ సాక్షాత్తు టిడిపి అధినేత [more]

Update: 2019-06-24 02:30 GMT

ప్రభుత్వ డబ్బుతో అమరావతిలో కట్టిన ప్రజావేదిక కేంద్రం గా రచ్చ రచ్చ మొదలైపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇది తమకు అప్పగించాలంటూ సాక్షాత్తు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాయడం పెద్ద చర్చకే దారితీసింది. కృష్ణా కరకట్టపై నిర్మించిన ఈ కట్టడం పై తొలినుంచి వివాదాలే. ఎలాంటి అనుమతులు లేకుండానే ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదనలతో నాటి మంత్రి నారాయణ నోటి మాటతో మొదలై 8. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రజావేదిక పై గతంలో వైసిపి అధికారపక్షంపై యుద్ధమే చేసింది. చంద్రబాబు నాయుడు నివాసం సైతం కరకట్టపై నిర్మితమైన అక్రమ నిర్మాణమని గోలగోల చేసింది. అయినా పవర్ లో బాబు అప్పుడు ఉండటంతో విపక్షం గోల అరణ్యరోదనే అయ్యింది.

స్వాధీనం చేసుకున్న జగన్ సర్కార్ ….

తాజాగా ప్రజావేదికను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన కట్టడాన్ని పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు వినియోగించాలని చూస్తున్నారనే అనుమానంతో మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పొజిషన్ లోకి తీసుకుంది. అయితే దీనిపై విపక్షం అగ్గిమీద గుగ్గిలమే అయ్యింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నుంచి టిడిపి నేతలు రాజేంద్ర ప్రసాద్, అనురాధలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. స్వాధీనం చేసుకునేముందు కనీసం నోటిస్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు సామాన్లు అన్ని బయటకు విసిరేయడం 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని అవమానించడమే అంటూ గరం గరం అయ్యారు.

బొత్స మార్క్ ….

ప్రజావేదిక స్వాధీనం లో తన సీనియారిటీని మంత్రి బొత్స సత్యనారాయణ వినియోగించారు. నోటీసులు వంటివి ఇవ్వడం వల్ల టిడిపి కోర్ట్ కి ఎక్కడం ఏళ్ళ తరబడి ఆ వివాదం సాగడం తెలిసిందే అని లెక్కేసి ప్రజల డబ్బుతో కట్టిన భవనాలు ప్రభుత్వాలు మారక కొత్త సర్కార్ పరిధిలో వుంటాయని తెలియకపోతే ఎలా అంటున్నారు ఆయన. కలెక్టర్ ల సమావేశాలు వంటివి నిర్వహించుకోవడానికి ఈ వేదిక అనువుగా ఉందని హోటల్స్ లో అవి నిర్వహిస్తే ప్రజల సొమ్ము మరింత దుర్వినియోగం అవుతుందని చెప్పుకొస్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు విదేశీ టూర్లో ఉండగా ఒక పక్క సొంత పార్టీ రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి దూకేయడం మరికొందరు ఎమ్యెల్యేలు కమలం వైపు చూస్తూ ఉండటంతో ఇప్పటికే పసుపు పార్టీ క్యాడర్ బిక్కచచ్చి పడివుంది. అదే సమయంలో బాబు డ్రీం ప్రాజెక్ట్ లు ప్రభుత్వ పరం చేసుకుంటుండటంతో మరింత ఢీలా పడుతున్నారు తమ్ముళ్ళు.

Tags:    

Similar News