ఆ మంత్రులకు అస్సలు నిద్రపట్టడం లేదట

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరోవైపు జగన్ వార్నింగ్ లు వారిని నిద్రపోనివ్వడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టే మంత్రివర్గంలో ఉంటారా? లేదా? [more]

Update: 2020-04-07 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరోవైపు జగన్ వార్నింగ్ లు వారిని నిద్రపోనివ్వడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టే మంత్రివర్గంలో ఉంటారా? లేదా? అన్నది తేల్చుకోవాలని సిగ్నల్స్ పంపారు. దీంతో మంత్రులందరూ స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఈలోగా కరోనా రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికార యంత్రాంగం మొత్తం కరోనా కట్టడిలో నిమగ్నమయింది.

ఐదాగురు మినహాయించి….

ఆంధ్రప్రదేశ్ లో ఐదారుగురు మంత్రులు తప్పించి మిగిలిన వారందరూ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. తమ జిల్లాలో రాజకీయ పరిస్థితులను వారు బేరీజు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్య నేతలతో నిత్యం సమావేశమవుతూ స్థానిక సంస్థల ఎన్నికలను గట్టెక్కే విషయంపై చర్చిస్తున్నారు. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోనాను రానున్న ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని నేతలకు హితబోధ చేస్తున్నారు.

అందరూ జిల్లాల్లోనే…..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన, చేయబోయే అభ్యర్థులను జనం వద్దకు వెళ్లమని చెబుతున్నారు. వారిని ఆపద సమయంలో ఆదుకుంటే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారని నూరిపోస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం కూడా అందించాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇచ్చినా నమ్మకంగా మీరు చెప్పినట్లు వింటుందని చెబుతున్నారు. దీంతో స్థానిక సంస్థల అభ్యర్థులు ప్రచారం చేయకుండానే ప్రజలను ఆదుకునే పనిలో పడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై…..

ముఖ్యంగా నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మంత్రులు కొందరు జిల్లాల్లోనే తిష్ట వేశారు. అక్కడే ఉండి కరోనా నియంత్రణపై సమీక్షలు చేస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తులు ప్రారంభించారు. కొందరు మంత్రులయితే ప్రత్యర్థి పార్టీల నేతలను కూడా తమ వద్దకు రప్పించుకుని మంతనాలు చేస్తున్నారు. మొత్తం మీద కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నా కొందరు మంత్రుల్లో స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ మాత్రం పోలేదనే చెప్పాలి.

Tags:    

Similar News