మూలాలనే మూసేస్తున్నారుగా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక వ్యూహం ప్రకారం వెళుతున్నారు. సామ, దాన, భేద, దండోపాయాలను టీడీపీ నేతలపై వినియోగిస్తూ వస్తున్నారు. [more]

Update: 2020-12-26 12:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక వ్యూహం ప్రకారం వెళుతున్నారు. సామ, దాన, భేద, దండోపాయాలను టీడీపీ నేతలపై వినియోగిస్తూ వస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే వారు కోలుకోలేరని జగన్ భావిస్తున్నారు. అందుకే వారి వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ పరంగా టీడీపీ నేతల వ్యాపారాలను తొక్కేసే పనిలోనే ఉన్నారు. ఇది వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే ప్రారంభమయింది.

బెదిరింపులు… లేకుంటే….?

ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త శిద్ధారాఘవరావు గ్రానైట్ పరిశ్రమలపై దాడులు జరిగాయి. గనుల శాఖ వంద కోట్ల జరిమానా విధించింది. దీంతో ఆయన వైసీపీ కండువా కప్పేసుకావాల్సి వచ్చింది. ఆయన చేరికతో వైసీపీకి ప్రత్యేకంగా ఏమీ లాభం లేకపోయినా టీడీపీకి భారీ విరాళాలిచ్చే ఒక నేతను కోల్పోవాల్సి వచ్చింది. ఇక టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా వందకోట్ల జరిమానా చెల్లించాలన్నారు. ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ సైలెంట్ అయ్యారు.

గల్లా గాయబ్…..

ఇక మరో పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కుటుంబానికి కూడా జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేేసింది. అయితే దీనిపై గల్లా కుటుంబం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. జగన్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత గల్లా కుటుంబం నోరు మెదపడం లేదు. ఇక జేసీ దివాకర్ రెడ్డి కి చెందిన మైనింగ్ కంపెనీకి కూడా వంద కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.

సంగం డెయిరీ కి కూడా….

దీంతో పాటు అముూల్ కంపెనీని రాష్ట్రంలోకి తీసుకు వచ్చారు. అమూల్ ద్వారా కేవలం హెరిటేజ్ కు మాత్రమే నష్టం కాదు. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా అమూల్ దెబ్బకు కుదేలయిపోతున్నారు. ధూళిపాళ్ల నరంద్ర చౌదరి కుటుంబానికి సంగం డెయిరీ ఉంది. డెయిరీ ప్రారంభం నుంచి ఆ కుటుంబమే పాలకవర్గంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ డెయిరీ విషయంలోనే ధూళిపాళ్ల కు టీడీపీ హయాంలో మంత్రి పదవి దక్కలేదంటారు. ఈ డెయిరీకి కూడా విజెలెన్స్ శాఖ నోటీసులు ఇచ్చింది. అమూల్ రాక ఎఫెక్ట్ సంగం డెయిరీ పై కూడా పడే అవకాశముంది. ఇలా కీలకమైన టీడీపీ నేతలందరి ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలోనే వైసీపీ ఉంది. దీంతో కొందరు వైసీపీకి సరెండర్ అవుతుండగా, మరికొందరు టీడీపీలోనే ఉండి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు.

Tags:    

Similar News