పోలవరం పై కేంద్రం వరం నిజమేనా ?

స్వర్గీయ వైఎస్ఆర్ జలయజ్ఞం లో డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం. అనితర సాధ్యమైన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలవాలన్న కల ఆయనదే. అందుకే ఎలాంటి [more]

Update: 2019-06-25 18:29 GMT

స్వర్గీయ వైఎస్ఆర్ జలయజ్ఞం లో డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం. అనితర సాధ్యమైన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలవాలన్న కల ఆయనదే. అందుకే ఎలాంటి అనుమతులు లేకుండా ధైర్యంగా మొదలు పెట్టి ఆ తరువాత ఒక్కో అనుమతి సాధిస్తూ సాగిపోయారు ఆయన. అనుకోకుండా హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడం తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో పోలవరం ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యత కాకపోవడం జరిగిపోయాయి. ఆ తరువాత రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ సర్కార్ హైదరాబాద్ కి బదులుగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ కు కానుక గా ఇచ్చింది.

ప్రచారం జాస్తి పని మాత్రం నాస్తి …

విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుంచి రాష్ట్రం చేపట్టేలా తీసుకున్నారు. కేంద్ర సర్కార్ నిర్మిస్తే దశాబ్దాల కాలం పడుతుంది అనే వాదన తెరపైకి తెచ్చి ఎపి ప్రభుత్వ నిధులు తో నిర్మాణం మొదలు పెట్టించారు. ఆ తరువాత కేంద్రం చేసిన పనులకు నిధులు ఇస్తున్నా, బకాయిలు వున్నాయంటూ బిజెపి సర్కార్ పై బ్లెయిమ్ గేమ్ మొదలు పెట్టేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం బాబు హయాంలో తొలి రెండేళ్ళు సాగనే లేదు. మరో రెండున్నరేళ్ళు ఆయన స్పీడ్ పెంచినా ఈ ప్రాజెక్ట్ ను తన ప్రచార అస్త్రంగా అన్ని పార్టీల పై వినియోగించారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్లలా వినియోగించి ఎపి లోని ప్రజలందరినీ ప్రాజెక్ట్ సందర్శన పేరుతో ఆర్టీసీ బస్సుల్లో పర్యటనలు ఏర్పాటు చేసి ఉచిత భోజన సదుపాయాలు కల్పించారు. దీనికి తోడు 2017 నుంచి గ్రావిటీ పై నీరిస్తామంటూ మూడేళ్ళు మభ్యపెట్టారు.

ఎటిఎం కార్డు లా వాడేశారా …?

సుమారు నాలుగువేలకోట్ల రూపాయలతో పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాలు చేపట్టి మరింత సొమ్ము గోదావరి పాలు చేశారు. ఇంత హడావిడి చేసినా 2019 లో అధికారం కోల్పోయే ముందు కూడా పోలవరం ప్రాజెక్ట్ పై అసత్యాలు వల్లెవేశారు. వైఎస్ కి పోలవరం క్రెడిట్ దక్కుతుందేమో అని అంతా తానె అనేవిధంగా వ్యవహారం నడిపించారు. ఇక కేంద్రం నిధులు సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఒక పక్క ఎటిఎం కార్డు లా పోలవరాన్ని వినియోగించుకున్నారని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ సైతం వాపోయారంటే ఏ స్థాయిలో ఇక్కడ అవినీతి రాజ్యమేలిందో విచారణ జరిపితే కానీ తేలేదంటున్నారు విశ్లేషకులు.

జగన్ వ్యూహాత్మక అడుగులు …

జగన్ సర్కార్ వచ్చాకా పోలవరం ప్రాజెక్ట్ పై వ్యూహం మార్చింది. కేంద్రం కట్టించి ఇవ్వలిసిన ప్రాజెక్ట్ ను రాష్ట్రం కట్టుకోవడం ఏమిటి అంటూ నిలదీసింది. అసలే అప్పుల ఊబిలో వున్న రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గుదిబండగా చేస్తే ఎలా అంటూ ప్రశ్నించింది. పోలవరం కేంద్రం బాధ్యతగా విభజన చట్టం చెప్పింది అన్న అంశాన్ని గుర్తు చేస్తూ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే అటు నీతి ఆయోగ్, అఖిలపక్షం ఇలా అన్ని వేదికలపై గళమెత్తారు ఎపి సిఎం వైఎస్ జగన్. దాంతో కేంద్రం తన బాధ్యత గుర్తెరిగింది . పోలవరం ప్రాజెక్ట్ కి పెరిగిన అంచనాలను పార్లమెంట్ లో ఆమోదించింది. 2017- 2018 సం|| అంచనా వ్యయాన్ని పరిగణలోనికి తీసుకుంది 55 వేలకోట్ల రూపాయలకు మొత్తం ప్రాజెక్ట్ వ్యయం గా నిర్ణయించింది. దాదాపు 33 వేలకోట్లరూపాయలు పునరావాసానికి అయ్యే ఖర్చు గా తేల్చింది. ఇది జగన్ సర్కార్ సాధించిన తొలి విజయంగానే చెప్పుకోవాలి. చంద్రబాబు హయాంలో పునరావాసం తమకు సంబంధం లేదన్న కేంద్రం ఇప్పుడు చట్టసభ వేదికగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని పరిగణలోనికి తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ కి శుభపరిణామమే. సిఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని ప్రచార ఆర్భాట అంశంగా పరిగణలోకి తీసుకోకుండా సీరియస్ గా ప్రాజెక్ట్ పూర్తిపై దృష్టి పెట్టడం తో మోడీ సర్కార్ సైతం బాధ్యత తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఆచరణలో ఇదెంత వరకు అమలు చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News