బతుకు బస్టాండేనా …?

పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హై కోర్టు తో సహా ఉండేలా ఎపి పునర్విభజన చట్టం చేశారు. కానీ కొంపలు అంటుకుపోతున్నట్లు ఎలాంటి సౌకర్యాలు లేకుండా సీఎం [more]

Update: 2018-12-29 18:29 GMT

పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హై కోర్టు తో సహా ఉండేలా ఎపి పునర్విభజన చట్టం చేశారు. కానీ కొంపలు అంటుకుపోతున్నట్లు ఎలాంటి సౌకర్యాలు లేకుండా సీఎం చంద్రబాబు అనుకోని కేసులో ఇరుక్కొని రాత్రికి రాత్రి అన్ని హక్కులు వదులుకుని హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తేసిన ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ఎలాంటి సౌకర్యాలు లేని ఏపీకి మూటాముల్లె సర్దుకుని ఒక్కో విభాగం అత్యవసరంగా బయలుదేరక తప్పడం లేదు. దీనికి హై కోర్టు కూడా అతీతం కాదన్నది న్యాయస్థానాన్ని విభజిస్తూ జారీ చేసిన గెజిట్ సాక్ష్యంగా నిలిచింది. మరో రెండు మూడు నెలల సమయంలో పూర్తిస్థాయి హై కోర్టు భవనాలు సిద్ధం అయ్యే పరిస్థితి ఉండగా, హడావిడి గా హైదరాబాద్ ను విడిచి న్యాయవాదులు పొట్ట చేత పట్టుకుని అమరావతి బాట పట్టాలిసిన పరిస్థితి ఏర్పడింది. ఈ తంతు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయం అయ్యింది.

ఇవే దిక్కు …

జనవరి ఒకటో తేదీ నుంచి ఎవరి కోర్ట్ వారిదే అంటూ న్యాయమూర్తులతో సహా విభజించారు. సరే వీరందరితో ఎపి హై కోర్టు ఎక్కడ నిర్వహించాలా అన్న సమస్యకు సర్కార్ తాత్కాలిక పరిష్కారం వెతికింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, ఆర్ అండ్ బి శాఖల భవనాలను ప్రస్తుతానికి అడ్జెస్ట్ చేసే కార్యాచరణను అధికారులు మొదలు పెట్టారు. దాంతో న్యాయమూర్తులు కూర్చునేందుకు కోర్ట్ ప్రక్రియ ఎదో రకంగా నడిపించేందుకు ఆస్కారం ఏర్పడినా తెలంగాణ లో వున్న ఏపీ న్యాయవాదులు పరిస్థితి మాత్రం అయోమయం అగమ్య గోచరంగా మారిపోయింది.

అనాలోచిత నిర్ణయాలు …

భాగ్యనగర్ లో ఏళ్లతరబడి వున్న ఏపీ న్యాయవాదులు తమ ఆస్తులను, కుటుంబాన్ని వదులుకుని అమరావతిలో ప్రాక్టీస్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇల్లు సంగతి దేవుడెరుగు కనీసం ఆఫీస్ లు ప్రారంభించాలన్నా తడిసి మోపెడు అయ్యే పరిస్థితి. ఈ ఖర్చుకు భయపడి కేసులు వదులుకుంటే తమ వృత్తికి తిలోదకాలు ఇచ్చినట్లు అయ్యి మొదటికే మోసం జరుగుతుంది. దాంతో ఎపి న్యాయవాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస సమయం కూడా ఇవ్వకుండా అన్యాయంగా గెంటివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతల అనాలోచిత నిర్ణయాలు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తమకు ఈ దుస్థితి తెచ్చిపెట్టాయని వాపోతున్నారు . ఈ నేపథ్యంలో న్యాయవాదులు హై కోర్టు విభజనపై సుప్రీం మెట్లు ఎక్కక తప్పలేదు. మరి వీరి మొల అత్యున్నత న్యాయస్థానం ఏ మేరకు ఆలకిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News