ఇద్ద‌రు సీఎంలు.. ఐదు భేటీలు.. స‌రికొత్త హిస్ట‌రీ

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స‌రికొత్త రికార్డ్ న‌మోద‌వుతోంది. తెలంగాణ, ఏపీ సీఎంల భేటీలు రాజ‌కీయంగా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. నిజానికి ప‌క్క‌ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, రాజ‌కీయ ప‌రిణామాలు [more]

Update: 2019-06-29 18:29 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స‌రికొత్త రికార్డ్ న‌మోద‌వుతోంది. తెలంగాణ, ఏపీ సీఎంల భేటీలు రాజ‌కీయంగా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. నిజానికి ప‌క్క‌ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, రాజ‌కీయ ప‌రిణామాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. అయితే, ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో మాత్రం రాజ‌కీయ ప‌రిణామాలు గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చూసిన‌ప్పుడు చాలా వ‌ర‌కు మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల్లో క‌ల‌సి ముందుకు సాగుతామ‌నే విధంగా రాజ‌కీయాలు నెల‌కొన్నాయి. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్ప‌టికి ఐదు సార్లు భేటీ కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా రాష్ట్ర ప‌రిస్థితుల‌ను చూసినా.. రికార్డుగానే భావించాల్సి ఉంటుంది.

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి నెల రోజులు కూడా కాకుండానే వ‌రుస భేటీలు కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ సంచ‌ల‌నంగా మారింది. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు అలానే ఉండిపోయాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి ఆస్తుల‌కు సంబంధించిన లెక్క‌లు, విద్యుత్ బ‌కాయిలు, నీటి పంప‌కాలు వంటివి చాలా వ‌ర‌కు అప‌రిష్కృతంగా ఉండిపోయాయి. దీనికి సంబంధించి చ‌ట్టంలో పేర్కొన్న విధంగా కూడా అడుగులు ముందుకు ప‌డ‌లేదు. కేంద్రం నుంచి స‌హ‌కారం అందే విష‌యంలో తెలంగాణ నుంచి అభ్యంత‌రం వెలువ‌డితే.. ఏపీ ముందుకు వెళ్ల‌ద‌నే విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తెలంగాణ విష‌యంలో ఏపీ స‌ఖ్య‌త‌గా ఉండాల‌నే ప్ర‌తి ఒక్క‌రూ కొరుతున్నారు.

అయితే, గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న నేప‌థ్యంలో అటు కేసీఆర్‌, ఇటు చంద్ర‌బాబు ఇద్ద‌రూ కూడా పంతాల‌కు పోయి, రాజ‌కీయాల‌ను వివాదాల్లోకి నెట్టారు. ఫ‌లితంగా ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. చంద్ర‌బాబు ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు వీరిద్ద‌రు క‌లుసుకుంటేనే గొప్ప వార్త అన్న‌ట్టుగా ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాల సంబంధాల విష‌యంలో చాలా మ‌ర్పులు వ‌చ్చాయి.

అయితే, తాజాగా రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు, తెలంగాణ‌లో కేసీఆర్ ఏపీతో పొత్తుకు ముందుకు రావ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌పై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా న‌దీజ‌లాల విష‌యంలో జ‌గ‌న్, కేసీఆర్ ఆలోచ‌న‌లు ఒక్క‌టిగా క‌లిస్తే గొప్ప విష‌య‌మే అవుతుంది. ఈ బంధం మ‌రింత బ‌ల‌ప‌డితే.. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కీల‌కం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News