స్టీల్ సిటీ ….. ఐటీ సిటీ…?

విశాఖకు మరో పేరు ఉక్కు నగరం. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఉన్న విశాఖకు ఉక్కు లాంటి గర్వాన్ని బీజేపీ ప్రభుత్వం కరిగించేస్తోంది. [more]

Update: 2021-07-04 11:00 GMT

విశాఖకు మరో పేరు ఉక్కు నగరం. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఉన్న విశాఖకు ఉక్కు లాంటి గర్వాన్ని బీజేపీ ప్రభుత్వం కరిగించేస్తోంది. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. ఆ ఆలోచన ఈ రోజుకు వాయిదా పడితే పడవచ్చు కానీ పూర్తిగా రద్దు చేసుకోవడం అనేది అసలు జరగదు అని ఢిల్లీ వర్గాల నుంచి వినవస్తున్న మాట. ఈ నేపధ్యంలో విశాఖ మీద జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. విశాఖకు ఆయన స్టీల్ సిటీ నుంచి ఐటీ సిటీగా కొత్త రూపు ఇవ్వదలచుకున్నారు.

బెస్ట్ విజన్ ….

జగన్ మొదటి నుంచి విశాఖ విషయంలోనే ఆసక్తిగా ఉన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరంగా వైజాగ్ ఉంది. కొంచెం ఖర్చు పెట్టినా కూడా డాబుసరి నగరంగా మారుతుంది అన్నది ఆయన ఆలోచన. అందుకే పరిపాలనా రాజధానిగా విశాఖను ఆయన ప్రకటించారు. అదే విధంగా ఇపుడు ఐటీ సిటీగా కూడా విశాఖను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐటీ పరంగా విశాఖ నెమ్మదిగా ఎదుగుతోంది. గతంలో హైదరాబాద్ ఐటీకి కేంద్రంగా ఉంటే విశాఖ రెండవ స్థానంలో ఉంది. ఇపుడు విభజన ఏపీలో కచ్చితంగా విశాఖే నంబర్ వన్ కావాలి కూడా. అందుకే జగన్ విశాఖలో ఐటీ వర్శిటీనే స్థాపించనున్నారు.

ఉపాధికి కేంద్రం….

హైదరాబాద్ రాజధానిని ఉపాధి కేంద్రంగా అంతా భావిస్తారు. విభజన వద్దు అనుకున్నది కూడా అందుకోసమే. ఇపుడు విభజన ఏపీకి అలాంటి నగరంగా విశాఖను తీర్చిదిద్దుదామన్నది జగన్ అజెండాగా ఉంది. విశాఖకు ఉన్న పొటెన్షియాలిటీని దృష్టిలో ఉంచుకుని అటు ఐటీ పరంగా ఇటు టూరిజం పరంగా అభివృద్ధి చేస్తే ఉపాధి కల్పన సాధ్యపడుతుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి అయినా విశాఖలో ఏర్పాటు చేయించాల‌న్నది వైసీపీ సర్కార్ ఆలోచన. అలాగే యువత ఐటీలో నైపుణ్యం సాధించేలా శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఏపీలో ఐటీకి కేరాఫ్ గా విశాఖని చేస్తే ఉపాధి కల్పన సాధ్యపడుతుందన్నది జగన్ మాస్టర్ ప్లాన్. భారతదేశాన బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లతో పోటీ పడే స్థాయి కూడా వస్తుందని భావిస్తున్నారు.

అనుకూలమే…

విశాఖ ఐటీ రాజధాని కావడానికి స్థానికంగా ఉన్న పరిస్థితులు అనుకూలిస్తాయి. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రేపటి రోజున రాజధాని కూడా విశాఖకు తరలివస్తే ఐటీకి మరింతగా ప్రోత్సాహం దక్కుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఐటీ పాలసీ కూడా కంపెనీల స్థాపనకు మేలు చేసేదిగా ఉంది. ఇక ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల విశాఖలో ఐటీ రంగం పరుగులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. అలాగే విద్యారంగానికి నిలయంగా విశాఖను తీర్చిదిద్దుతామని మంత్రి అవంతి శ్రీనివాసరావు అంటున్నారు. మొత్తానికి ప్రభుత్వ పెద్దల ఆలోచనలు చూస్తూంటే వైజాగ్ కి ఐటీ సిటీ కళ వచ్చేసినట్లే అనుకోవాలేమో.

Tags:    

Similar News