టీడీపీ గూటికి ఆనం ఫ్యామిలీ…?

ఆనం కుటుంబం అంటే నెల్లూరు జిల్లాలో ఒక విలువ రాజకీయ మర్యాద ఉంది. ఆ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా కూడా వారిని గౌరవించే వారినే ఇంతదాకా [more]

Update: 2020-12-31 13:30 GMT

ఆనం కుటుంబం అంటే నెల్లూరు జిల్లాలో ఒక విలువ రాజకీయ మర్యాద ఉంది. ఆ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా కూడా వారిని గౌరవించే వారినే ఇంతదాకా అంతా చూశారు. అయితే జగన్ జమానాలో మాత్రం ఆనం ఫ్యామిలీ పరపతి బాగా పొలిటికల్ గా బాగా డౌన్ అయిపోయింది. వైఎస్సార్ ప్రభుత్వంలో కానీ ఆనక వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో కానీ అతి ప్రధాన‌మైన మంత్రిత్వ శాఖలు చూసిన ఆనం రాంనారాయణ రెడ్డి ఇపుడు జగన్ ప్రభుత్వం వట్టి ఎమ్మెల్యే మాత్రమే. ఇది తలచుకుని ఆయన బాగా కుములుతున్నారు.

రోజులు వస్తాయట…

ఆనం వివేకానందరెడ్డి బతికి ఉంటే మొదట వైసీపీలో తమ్ముడిని చేరనివ్వరు, చేరినా ఇన్ని రోజులు ఓపిక పట్టి కూడా ఉండరు. రాం నారాయణరెడ్డి నిదానస్తుడు కాబట్టి అడపా దడపా హాట్ కామెంట్స్ చేస్తూ సర్దుకుపోతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో ఆనం ఫ్యామిలీ వచ్చే ఎన్నిక‌ల దాకా అయినా కొనసాగుతుందా అన్న డౌట్లు అయితే అందరికీ కలుగుతున్నాయి. జగన్ ఆయనకు టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేను చేశారు కూర్చోబెట్టారు. నిజానికి టికెట్ ఇవ్వడం దగ్గరనే ఆనం రాంనారాయణ రెడ్డికి పెద్ద మర్యాద దక్కిందని వైసీపీ నేతల మాట. ఎందుకంటే ఆయన కంటే ముందే మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయన కూడా వెంకటగిరి టికెట్ ఆశించారు. అయినా జగన్ పెద్దాయన అని ఆనం రాంనారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చారు. జగన్ వేవ్ లో గెలిచారు. అయితే ఇపుడు మాత్రం మంత్రి పదవి అయినా దక్కలేదన్న బాధతో ఆనం వర్గం రగులుతోంది. మాకూ రోజులు వస్తాయని గట్టిగానే చెబుతోంది.

మళ్ళీ పాత గూటికే…?

రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శాశ్వత శత్రువులు ఉండరు. ఆనం చంద్రబాబు పాలనను ఇదే తీరున అప్పట్లో విమర్శించారు. జగన్ ని నాడు మెచ్చుకుని మరీ విజయనగరం జిల్లా దాకా వచ్చి పాదయాత్రలో కండువా కప్పించుకున్నారు. ఇదంతా పదవుల రాజకీయమే మరి. కావాల్సిన మంత్రి పదవి దక్కకపోయేసరికి జగన్ మా చెడ్డ నాయకుడిగా కనిపిస్తున్నాడు. అందుకే ఆనం రాంనారాయణ రెడ్డి తన ఇతర సోదరులతో కలసి మొత్తానికి మొత్తం ఫ్యామిలీ అంతా కలసి టీడీపీ సైకిల్ మళ్లీ ఎక్కాలని ఉబలాటపడుతున్నారట. అంతే కాదు, నెల్లూరులోని ప్రతీ నియోజకవర్గంలోనూ తన మనుషులు ఉన్నారని కూడా చెబుతున్నారు. అంటే పెద్ద గ్యాంగ్ తోనే బాబు పార్టీలో చేరేందుకు ఆనం రాంనారాయణ రెడ్డి రెడీ అవుతారని అంటున్నారు.

నో ప్రాబ్లమా..?

నెల్లూరులో రాజకీయ పెత్తనం ఇంతదాక రెడ్లు చేసేవారు. ఇపుడు బీసీలకు జగన్ ఫస్ట్ టైం చాన్స్ ఇచ్చారు. అటు టీడీపీ అయినా కూడా బీసీలను పక్కన పెట్టి రెడ్లనే అక్కున చేర్చుకుంది. దాన్ని మార్చేసిన జగన్ బీసీలకు కిరీటం పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జిల్లాలో యాదవుల ప్రాబల్యం కూడా బాగా ఉంది. అందుకే అనిల్ కుమార్ ని మంత్రిని చేశారు. జగన్ తన సొంత సామాజికవర్గాన్ని సైతం కాదని బీసీలకు పదవులు ఇవ్వడం వెనక ఉన్న రాజకీయ వ్యూహమే ఇది. అలా గరిష్టమైన రాజకీయ లాభం వైసీపీకే దక్కుతుంది. అందువల్ల ఆనం రాంనారాయణ రెడ్డి వెళ్ళినా నష్టం లేదన్నది వైసీపీలో పెద్దల మాట. ఏది ఏమైనా మారిన రాజకీయాల్లో పాతకాలం నాటి పెద్ద కుటుంబాలు సర్దుబాటు కావడం అంటే కష్టమే అని అంటున్నారు.

Tags:    

Similar News