వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే సీన్‌.. చంద్ర‌బాబుకే అగ్నిప‌రీక్ష

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? జ‌గ‌న్ ఆధ్వర్యంలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు ఖాయ‌మేనా ? ఏ ఇద్దరు వ్యక్తులు క‌లిసినా.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ [more]

Update: 2020-11-15 06:30 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? జ‌గ‌న్ ఆధ్వర్యంలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు ఖాయ‌మేనా ? ఏ ఇద్దరు వ్యక్తులు క‌లిసినా.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రజ‌లు.. ఏపీకి వ‌చ్చినా.. ఏపీ వారు అక్కడ‌కు వెళ్లినా.. జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే.. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్రతి ఒక్కరూ ఆస‌క్తిగా ఉన్నారు. అంటే ఈ విష‌యంలో మ‌ద్దతిస్తున్నార‌ని కాదు.. ఈ ప్రాజెక్టు విష‌యంలో అంతిమ నిర్ణయం ఎలా ఉంటుంది ? సీనియ‌ర్ నాయ‌కుడైన చంద్రబాబు, ప్రస్తుత సీఎం జ‌గ‌న్ పంతాల్లో ఏది నెగ్గుతుంది ? ఎవ‌రు పైచేయి సాధిస్తారు ? అనే విష‌యంపైనే అత్యంత ఆస‌క్తి నెల‌కొంది. దీంతో రాష్ట్రంలో ఈ చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది.

న్యాయ విచారణలో….

ప్రస్తుతం రాజ‌ధానికి అనుకూలంగా మూడు రాజ‌ధానుల‌కు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో రోజు వారీగా విచార‌ణ జ‌రుగుతోంది. ఈ విచార‌ణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. కానీ, స‌ర్కారు మాత్రం అత్యంత వేగంగా పూర్తయిపోయి.. త‌మ‌కు అనుకూలంగా తీర్పు రావాల‌ని కోరుకుంటోంది. అదే స‌మ‌యంలో రాజ‌ధాని ప్రజ‌లు కూడా త‌మ‌కు అనుకూలంగా తీర్పురావాల‌ని కోరుకుంటున్నారు. వీరు కూడా వేగంగానే పూర్తికావాల‌ని కోరుకుంటున్నారు. స‌రే.. వేగంగా తీర్పు వ‌చ్చేసినా.. మూడు రాజ‌ధానులు ఏర్పడ‌తాయా ? అంటే.. క‌ష్టమేన‌నే సంకేతాలే వ‌స్తున్నాయి.

ఎవరికి అనుకూలంగా వచ్చినా…..

అదే స‌మ‌యంలో రాజ‌ధాని అమ‌రావ‌తికి అనుకూలంగా తీర్పు వ‌చ్చినా.. అదేమైనా నిర్మాణాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుందా ? అంటే.. అది కూడా క‌ష్టమ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర‌వమంటే.. క‌ప్పకు, వ‌ద‌ల‌మంటే పాముకు చిర్రెత్తుకొచ్చిన వ్యవ‌హారంగా మారిన రాజ‌ధాని విష‌యంలో హైకోర్టు తీర్పు ఇప్పట్లో వెలువ‌రించే అవకాశం క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ అటు రైతుల‌కు అనుకూలంగా ఇచ్చినా.. ప్రభుత్వం, స‌ర్కారుకు అనుకూలంగా తీర్పు చెబితే.. రైతులు.. పై కోర్టుకు వెళ్లే సూచ‌న‌లు స్పష్టంగా ఉన్నాయి. మొత్తంగా ఈ విష‌యం ఇప్పట్లో తేలే ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు.

తేలినా…తేలకపోయినా….

ఇంత‌లో 2024 ఎన్నిక‌లు రానే రానున్నాయి. అప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఏంటి ? మూడు రాజ‌ధానుల‌తో రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తామ‌ని చెప్పినా.. చంద్రబాబు అడ్డుప‌డ్డార‌ని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. అదే స‌మ‌యంలో టీడీపీ ఏం చేయనుంది. మూడు రాజ‌ధానుల‌ను వ‌ద్దని చెబుతుందా ? లేక వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మారుతున్న వ్యవ‌హారం. ఈ మూడు రాజ‌ధానులు ముడిప‌డి.. తేల‌క‌పోయినా.. తేలినా త‌మ‌కే లాభ‌మ‌ని వైసీపీ నేత‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో.. మొత్తానికి చంద్రబాబు ఏం చేస్తార‌నేదే ? చూడాలి.

Tags:    

Similar News