భాజపాలో పరివర్తన్.. షా కు..పశ్చిమ బంగ ..ఛాయిస్

భారతీయ జనతాపార్టీలో అటల్ బిహారీ వాజపేయి, అద్వానీల జోడీని నరేంద్రమోడీ, అమిత్ షాలు మరిపింప చేసేశారు. నిజానికి పార్టీ ని విస్తార పరిచి సైద్దాంతికంగా బలోపేతం చేసేందుకు [more]

Update: 2021-02-20 16:30 GMT

భారతీయ జనతాపార్టీలో అటల్ బిహారీ వాజపేయి, అద్వానీల జోడీని నరేంద్రమోడీ, అమిత్ షాలు మరిపింప చేసేశారు. నిజానికి పార్టీ ని విస్తార పరిచి సైద్దాంతికంగా బలోపేతం చేసేందుకు వాజపేయిని మించి కష్టపడ్డారు అద్వానీ. అయితే సంకీర్ణాల శకంలో అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిగా వాజపేయి సామరస్యం పనికి వచ్చింది. పీఠంపై కూర్చున్నారు. అద్వానీకి సెకండ్ ఇన్ కమాండ్ గా గుర్తింపు వచ్చిందే తప్ప అత్యున్నత పదవీభాగ్యం దక్కలేదు. కానీ ప్రస్తుత భాజపా జోడీలో మోడీ తర్వాత షా శకం మొదలవుతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో జరగనున్న శాసనసభ ఎన్నికలు అమిత్ షా రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే చాయిస్ గా పరిశీలకులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పార్టీలో పరివర్తన్ మొదలైందని చెబుతున్నారు.

షా వర్సస్ దీదీ…

పశ్చిమబెంగాల్ లో మార్పు రావాలంటూ బీజేపీ పరివర్తన్ ర్యాలీలు నిర్వహిస్తోంది. అగ్రనేత అమిత్ షా ఇందులో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018 నుంచే పశ్చిమబెంగాల్ ను లక్ష్యంగా చేసుకుని ‘షా’ తెరవెనక, ముందు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారానికి , బీజేపీ ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న పెద్ద రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలుస్తోంది. అత్యంత ప్రజాదరణ కలిగిన మమత బెనర్జీ పోరాట పటిమ బీజేపీ విస్తరణను నిలువరిస్తోంది. నేరుగా నరేంద్రమోడీకే ఆమె పలు సందర్బాల్లో సవాల్ విసిరారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ మమతను గద్దె దింపాల్సిందేనని బీజేపీ అధిష్ఠానం పంతం పెట్టుకుంది. ఇందుకుగాను జాతీయ స్థాయిలో వ్యూహకర్త, అమిత్ షా నే స్వయంగా రంగంలోకి దిగారు. గతంలో ఎన్నో ఎన్నికలలో విజయం సాధించి పెట్టిన ఘనత అతనికి దక్కుతుంది. ప్రచార సారథిగా, నాయకుడిగా నరేంద్రమోడీది మొదటి స్థానమే. కానీ అన్నిరకాల ఎత్తుగడలతో పావులు కదిపి మోడీని నడిపించేది అమిత్ షానే అన్నది అందరికీ తెలిసిందే. ఈ ప్రస్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు , ఇతర నాయకులు నామమాత్రమే. మోడీ, షా ల ఆలోచనలను ఆచరణ రూపంలో పెట్టే యంత్రాంగమే బీజేపీ అన్నట్లుగా మారిపోయింది వ్యవహారం. ఈ స్థితిలోనరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ విషయంలో నేరుగా తలపడుతున్నట్లుగా కనిపించకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. ఈ విడత అమిత్ షా నే మమతను ఢీకొంటున్నట్లుగా కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే మమత, అమిత్ షా ల మధ్య ముఖాముఖి విమర్శలు జోరందుకున్నాయి.

మోడీతో మొహం మొత్తినట్లే…

బీజేపీ ఇటీవలి కాలంలో ఎదురు దెబ్బలు తింటోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా అధికారం దక్కలేదు. సైద్దాంతికంగా తీవ్ర విభేదాలున్న మూడు ముక్కల ప్రభుత్వమే అక్కడ నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆ రాష్ట్రాన్ని చేజిక్కించుకోలేకపోయింది. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని మార్చేందుకు వేసిన ఎత్తులు పారలేదు. పంజాబ్ లో మిత్రపక్షమైన అకాలీ దళ్ దూరమైంది. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలతో పంజాబ్, రాజస్తాన్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో పార్టీ పట్ల వ్యతిరేకత తీవ్రమవుతోంది. సంఘ్ పరివార్ అనుబంధ రైతు, కార్మిక సంఘాలు సైతం కేంద్ర విధానాలతో విభేదిస్తున్నాయి. ఆయా నిర్ణయాలన్నీ భవిష్యత్తులో వైఫల్యాలుగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మోడీ యే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకునిగా ఉన్నారు.ఆయనను అగ్రస్థానం నుంచి కదపాలంటే చాలా కష్టం. రెండు సార్లు ప్రదానిగా చేసిన తర్వాత ఆ స్థానం కోసం పార్టీలో మరొకరు పోటీ పడాలంటే అంత సులభం కాదు. ఈ సమస్యకు పరిష్కారం కేవలం అమిత్ షా నే. మోడీ కూడా ప్రత్యామ్నాయంగా షా నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తారనే విశ్వాసం పార్టీలో ఉంది. గుజరాత్ లోమైనారిటీల ఊచకోత వంటి సందర్బాల్లో అత్యంత విశ్వాసపాత్రునిగా మెలగడమే కాకుండా జైలుకు వెళ్లేందుకు కూడా అమిత్ షా సిద్దపడ్డారు. అంతే తప్ప తన అధినాయకుడైన మోడీని ఏరకంగానూ ఇబ్బంది పెట్టలేదు. అందువల్ల మోడీకి విధేయుడు, అతని విశ్వాసాన్ని పొందిన సహచరుడు అమిత్ షానే. బాజపాలో ఆల్టర్నేటివ్ ఆలోచనలు మొదలైతే నరేంద్రమోడీయే స్వయంగా అమిత్ షా పేరు ప్రతిపాదించవచ్చు.

నిలబెట్టే యోధుడే…

పార్టీ పరంగా లెక్కలు కూడా అమిత్ షా కు అనుకూలంగా మారుతున్నాయి. ఒకవేళ పశ్చిమబెంగాల్ లో పార్టీ అధికారంలోకి రాగలిగితే పెద్ద విజయమవుతుంది. మరోసారి 2024లో కేంద్రంలో అధికారం వచ్చేసినట్లే భావించవచ్చని బీజేపీ అంచనా వేసుకుంటోంది. దేశంలో బలహీనంగా మారిన స్థానాలను పశ్చిమబెంగాల్ రూపంలో భర్తీ చేసుకోవచ్చుననుకుంటోంది. హిందుత్వ సిద్దాంతాల్లోని వాడి, వేడి ఏమాత్రం తగ్గకుండా చూసుకునేందుకు అమిత్ షా ను మించిన వ్యక్తి లేరని సంఘ్ పరివార్ కూడా భావిస్తోంది. మిత్రపక్షాలతో సంప్రతింపులు జరపడం, అందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకురావడంలోనూ అమిత్ షా నైపుణ్యం అమోఘమని చెబుతున్నారు. పశ్చిమబెంగాల్ ఫలితాలు బాజపాకు అనుకూలంగా వస్తే అమిత్ షా కు బాజపాలో జెన్ నెక్స్ట్ పీఎం సీటుకు ఓటు ఖరారైనట్లే. సెకండ్ ఇన్ కమాండ్ ఫస్టు ప్లేసుకు చేరుకునేందుకు బెంగాల్ ఓటరు ఎంతవరకూ సహకరిస్తారో వేచి చూడాలి.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News