వదలనంటున్నారే…!!

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానని వదిలపెట్టదలచుకోలేదు. శ్రమిస్తే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ [more]

Update: 2019-08-05 09:30 GMT

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానని వదిలపెట్టదలచుకోలేదు. శ్రమిస్తే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తెలంగాణ రాష్ట్ర పార్టీపై దృష్టి పెట్టారు. మరోసారి ఆయన తెలంగణాకు రానున్నారు. ఆయన తెలంగాణ నుంచే పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుంటారన్న ప్రచారమూ జరుగుతోంది.

సభ్యత్వ నమోదులో….

అమిత్ షా… మోదీ పట్టుకుంటే వదలరంటారు. కమలం జెండా ఎగిరేంతవరకూ నిరంతరం పార్టీ నేతల వెంటపడుతూనే ఉంటారు. అనేక రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు తెలంగాణను కూడా మోదీ, అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా సునితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణకు 18 లక్షల సభ్యత్వం లక్ష్యంగా ఇక్కడి నాయకులకు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆరు లక్షల సభ్యత్వం మాత్రమే పూర్తయింది. ఆన్ లైన్ మరో లక్షన్నర మంది సభ్యత్వాన్ని తీసుకున్నట్లు అంచనా.

మరోసారి రాష్ట్రానికి…..

అమిత్ షా గత నెల 6వ తేదీన స్వయంగా తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 11తో సభ్యత్వ నమోదు కార్యక్రమం గడువు ముగియనుంది. తర్వాత ఆగస్టు 11 నుంచి 31వ తేదీ వరకూ క్రియాశీల సభ్యత్వ నమోదును ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే ఈనెల రెండో వారంలో అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేతల మధ్య సమన్వయం కుదర్చడంతో పాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం అమిత్ షా రాక ప్రధాన ఉద్దేశ్యంగా కన్పిస్తోంది.

భారీగా చేరికలు…..

అమిత్ షా రాక సందర్భంగా చేరికలు కూడా భారీగానే ఉండేలా రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి నాయకత్వం కొరవడటంతో అనేకమంది నేతలు బీజేపీలో చేరే అవకాశముంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, కొండాసురేఖ దంపతులు, టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ ెడ్డి, పాల్వాయి రజనీకుమారి వంటి నేతలు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద అమిత్ షా మాత్రం తెలంగాణలో పవర్ లోకి వచ్చేంత వరకూ పార్టీ నేతలను వదిలిపెట్టకుండా వెంటపడతారన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News