ముగిసిన అమరావతి కధ ?

ఏపీ రాజకీయాల గురించి బ్యాంకులకు కూడా పూర్తి అవగాహన వచ్చేసినట్లుగా ఉంది. అందుకే ఏపీ రాజధాని ఏది అంటే అవి కూడా తడుముకోకుండా ఒక్కటే సమాధానం చెబుతున్నాయి. [more]

Update: 2021-04-23 14:30 GMT

ఏపీ రాజకీయాల గురించి బ్యాంకులకు కూడా పూర్తి అవగాహన వచ్చేసినట్లుగా ఉంది. అందుకే ఏపీ రాజధాని ఏది అంటే అవి కూడా తడుముకోకుండా ఒక్కటే సమాధానం చెబుతున్నాయి. అమరావతి మాత్రం కాదు అన్నదే ఆ సమాధానం. అందుకే అమరావతిలో సర్కార్ నిర్మాణాలు చేపడతామంటే కూడా ఒక్క పైసా కూడా బ్యాంకుల నుంచి అప్పు పుట్టే పరిస్థితి లేదుట. ఇపుడున్న పొలిటికల్ సినేరియాలో ఎందుకు అప్పులు ఇవ్వాలి, ఇస్తే మాత్రం రాజధాని కాని రాజధాని అమరావతి నుంచి ఎలా వసూల్ అవుతాయి అన్న బోలేడు సందేహాలు కూడా బ్యాంకర్లకు పుడుతున్నాయట.

ఇవ్వమంతే ..?

తాజాగా జగన్ ప్రభుత్వం అమరావతిలో పెండింగులో ఉన్న కొన్ని నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అధారిటీ ఈ నిర్మాణాలకు ఏకంగా రెండు వేల కోట్లు పైదాకా ఖర్చు అవుతుందని లెక్క వేసింది. దాంతో బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి వాటిని పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావించింది. ఈ మేరకు ఏఎంఆర్డీఏ రుణం కోసం బ్యాంకుల తలుపును తట్టింది. అయితే దీనికి బ్యాంకుల నుంచి షాకింగ్ ఆన్సర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. తాము గతంలో మంజూరు చేసిన మూడు వేల కోట్ల రూపయాల రుణం సంగతి ముందు తేల్చాలని బ్యాంకులు కోరినట్లుగా ప్రచారంలో ఉంది. ఆ నిర్మాణాలను పూర్తి చేశామన్న నివేదికలు ఇస్తేనే కొత్త రుణం గురించి మాట్లాడాలని చెప్పారని టాక్. అంటే అప్పు లేదని చెప్పకుండా ఇలా జవాబు చెప్పారని అంటున్నారు.

ఇంతే సంగతులు …?

ఇదిలా ఉంటే సాధారణంగా బ్యాంకులు ఎవరికైనా రుణాలు ఇస్తాయి. అది కూడా ప్రభుత్వం తలపెట్టే అభివృద్ధి కార్యక్రమాలకు రుణం ఇవ్వడానికి సదా ముందుంటాయి. కానీ అమరావతి విషయంలో జగన్ సర్కార్ ఆలోచనలు వేరుగా ఉండడంతోనే బ్యాంకర్లు వెనకంజ వేశారు అంటున్నారు. కొత్తగా రుణం ఇచ్చినా కూడా ఉపయోగం లేదన్న భావనతోనే ఇలా చేశారు అంటున్నారు. అమరావతి రాజధానిగా ఇకపైన ఉండబోదు అన్న నిర్ధారణకు వచ్చాకే ఇలా మోకాలడ్డారా అన్న చర్చ కూడా వస్తోంది.

అదే ఖరారు …..

స్థానిక ఎన్నికలు ఏపీలో పూర్తి అయ్యాయి. కడప జిల్లాలో ఒక ఉప ఎన్నిక తప్ప మరే ఎన్నికలు దగ్గర‌లో లేవు. దాంతో జగన్ సర్కార్ విశాఖ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దాని కోసం ముహూర్తాలు కూడా పెట్టుకున్నారని టాక్. మరి దాటేస్తున్న అమరావతి రాజధానికి బ్యాంకులు రుణాలు ఇచ్చి అవి వసూల్ కాక నానా అవస్థలు పడడం ఎందుకు అన్న ముందు చూపుతోనే ఇలా వ్యవహరించాయి అన్న మాట అయితే ఉంది. ఏది ఏమైనా అమరావతి కధలు ఇపుడు అందరికీ తెలిసిపోవడమే అతి పెద్ద విషాదం.

Tags:    

Similar News