ఆమంచికి త‌ప్ప పార్టీ ఎవరికీ పట్టడం లేదుగా? వారి మనసంతా?

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే ప్రకాశం జిల్లా చీరాల వైఎస్సార్ సీపీలో నేతలు ప్రతి పక్షంపట్ల మౌన రాగం పాటిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీ [more]

Update: 2020-05-28 06:30 GMT

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే ప్రకాశం జిల్లా చీరాల వైఎస్సార్ సీపీలో నేతలు ప్రతి పక్షంపట్ల మౌన రాగం పాటిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రతిపక్ష టిడిపి మీద.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే చీరాల్లో మాత్రం మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ తప్ప మిగిలిన వైసీపీ నాయకులందరూ మౌన నవ్రతం పాటిస్తున్నారు . ముఖ్యంగా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కాని ఆయన తనయుడు కరణం వెంకటేష్ కాని, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు ఒక్కసారి కూడా చంద్రబాబును గాని తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించక పోవటం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయటం అనేది తప్పనిసరి కాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అనేక అంశాల్లో టీడీపీ అధికార ప‌క్షంపై తీవ్ర విమ‌ర్శలు చేస్తోంది.

అవసరాల కోసమేనా?

ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేత‌లు అంద‌రూ విమ‌ర్శలు చేస్తున్నా చీరాల‌లో మాత్రం ఆమంచి కృష్ణమోహన్ త‌ప్ప కొత్తగా పార్టీలోకి వ‌చ్చిన క‌ర‌ణం కాని.. ఆయ‌న త‌న‌యుడు కానీ టీడీపీపై నోరు మెద‌ప‌డం లేద‌న్న టాక్ ఉంది. 2019 ఎన్నిక‌ల్లో అప్ప‌టిక‌ప్పుడు అద్దంకి నుంచి చీరాల‌కు మారిన క‌ర‌ణం బ‌ల‌రాం ఇక్కడ విజ‌యం సాధించారు. పేరుకు ఎమ్మెల్యే అయినా ఆయ‌న టీడీపీలో స్తబ్దుగానే ఉన్నారు. ఇక త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం ఆయ‌న సైకిల్ దిగేశారు. ప్రస్తుతం క‌ర‌ణం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న‌యుడికి అద్దంకి సీటు ఇస్తామ‌న్న హామీ వైసీపీ నుంచి వ‌చ్చింద‌న్న ప్రచారం కూడా ఉంది. అయితే క‌ర‌ణం ఫ్యామిలీ త‌మ అవ‌స‌రాల కోస‌మే పార్టీ మారిందే త‌ప్ప టీడీపీ, చంద్రబాబును ప‌న్నెత్తు మాట అన‌డం లేద‌న్న టాక్ వైసీపీ వ‌ర్గాల్లో ఉంది.

జగన్ ప్రయారిటీ….

ఇక చీరాల‌లో మంచి ప‌ట్టు ఉండ‌డంతో పాటు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినఆమంచి కృష్ణమోహన్ కి ఇక్కడ పార్టీల‌తో సంబంధం లేకుండా బ‌లం ఉంది. ఆయ‌న టీడీపీలో ఉన్నప్పుడే టీడీపీ వాళ్లపై రుస‌రుస‌లాడేవారు. ఇక తాను వైసీపీలో చేరినప్పటి నుండి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏకిపారేస్తున్నారు . ప్రతి విషయంలోనూ గణాంకాలతో సహా చంద్రబాబు, టీడీపీని ఏకిపరేస్తున్నారు. అటు జ‌గ‌న్ సైతం ఆమంచి కృష్ణమోహన్ కి అధిక ప్రయార్టీ ఇస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలాయాన్ని సైతం ఆమంచి చేతుల మీదుగానే జ‌గ‌న్ ప్రారంభింప‌జేశారు. అటు ఆమంచి కృష్ణమోహన్ సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ఆయ‌న పార్టీ నేత‌ల‌పై సైతం తీవ్ర విమ‌ర్శలు చేసే ఆమంచి త‌న వ‌ర్గానికే చెందిన బీజేపీ అధినేత క‌న్నాతో పాటు ఎవరిపై అయినా తీవ్ర విమ‌ర్శలు చేస్తున్నారు.

ఎందరున్నా వాయిస్ లేకుండా…..

ఇక ఇటీవ‌ల చీరాల‌లో టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌లారం త‌న‌యుడు క‌ర‌ణం వెంకటేష్ వైసీపీలో చేరారు. ఇక చీరాల‌కే చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత‌, ఆమె భ‌ర్త పోతుల సురేష్ వైసీపీకి మ‌ద్దతు ప్రక‌టించారు. వీరంద‌రికి చీరాల ప్రత్యక్ష రాజ‌కీయాల‌తో సంబంధం ఉంది. ఇంత‌మంది ఉన్నా కూడా వైసీపీ నుంచి మాట్లాడాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఒక్క ఆమంచి కృష్ణమోహ‌న్ మిన‌హా ఎవ్వరూ కూడా నోరు మెద‌ప‌డం లేదు. వీరంతా భౌతికంగా మాత్రమే టీడీపీకి దూర‌మ‌య్యారే కాని.. మ‌న‌సంతా టీడీపీతోనే ఉంద‌ని.. వీరు ప‌నులు కూడా టీడీపీ వాళ్లకే చేస్తున్నార‌న్న విమ‌ర్శలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం చీరాల‌లో నిజమైన వైసీపీ కార్యక‌ర్తకు న్యాయం జ‌రిగే ప‌రిస్థితి లేద‌ట‌. అస‌లు ఎవ‌రు టీడీపీయో ? ఎవ‌రు వైసీపీయో కూడా అర్థం కావ‌డం లేద‌ని ఆ పార్టీ వాళ్లు గ‌గ్గోలు పెడుతున్నారు. మ‌రి అధిష్టానం చీరాల‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్ట‌క‌పోతే ఈ నాలుగేళ్లు వైసీపీ గ్రూపుల‌తోనే నాశ‌న‌మ‌య్యేలా ఉంది.

Tags:    

Similar News