తిరుపతి తరువాత సీన్ మారుతుందట ?

ఏపీలో రాజకీయం గుంభనంగా ఉంది. తెలంగాణాలో జనం నాడి తెలిసిపోయింది. అధికార పార్టీ టీయారెస్ పట్ల వ్యతిరేకత ఉందని కూడా వెల్లడైంది. ఇక ఏపీలో జగన్ సర్కార్ [more]

Update: 2020-12-13 14:30 GMT

ఏపీలో రాజకీయం గుంభనంగా ఉంది. తెలంగాణాలో జనం నాడి తెలిసిపోయింది. అధికార పార్టీ టీయారెస్ పట్ల వ్యతిరేకత ఉందని కూడా వెల్లడైంది. ఇక ఏపీలో జగన్ సర్కార్ మీద జనాభిప్రాయం ఏంటి అన్న దానికి తిరుపతి లోక్ సభ ఉప‌ ఎన్నికలనే కొలమానంగా తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతాయి అంటున్నారు. రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టుంది. అటువంటి చోటనే తొలి ఉప ఎన్నిక జరుగుతోంది. పైగా ఇది గతంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలుచుకున్న సీటు కావడంతో చాలా లెక్కలు ముడిపడి ఉన్నాయని అంటున్నారు.

ఎన్నో ప్రశ్నలకు జవాబు…

తిరుపతి ఎస్సీ రిజర్వ్డు సీటు. ఈ లోక్ సభ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీలు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో సామాజిక సమీకరణలు ఎటు వైపు అన్నది కూడా ఈ ఎన్నిక తేల్చనుంది. ఎస్సీలు వైసీపీ పెట్టాక ఇంతదాకా ఆ పార్టీ వైపే ఉంటూ వచ్చారు. ఇపుడు కనుక వారి ఓట్లలో చీలిక వస్తే అది వైసీపీకి దెబ్బగా చూడాలని విపక్షాలు ఉబలాటపడుతున్నాయి. అలాగే రాయలసీమలో జగన్ బలం అలాగే ఉందా తగ్గిందా అన్నది కూడా ఈ ఎన్నికలు తేల్చి చెప్పబోతున్నాయి. మూడు రాజధానుల విషయంలోనూ, జగన్ పాలన విషయంలో కూడా ఈ ఎన్నికలు జవాబు చెబుతాయి. అభివృద్ధి జరిగిందా లేదా, సంక్షేమ పధకాలు వల్ల సంతృప్తిగా జనం ఉన్నారా లేరా అన్నది కూడా తేల్చే ఎన్నికలు ఇవి.

బీజేపీ గాలి ఉందా…?

ఇప్పటికైతే తెలంగాణా ఎన్నికలను చూసి ఏపీలో బీజేపీలోకి జంప్ చేయాలని ఏ పార్టీ నాయకుడూ అనుకోవడంలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణాలో సహజంగానే బీజేపీకి బలం ఉంది. మొదటి నుంచి స్ట్రాంగ్ బేస్ ఉంది. అందుకే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కాయి. ఇపుడు గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడాన్ని అలాగే చూస్తున్నారు. ఏపీలో బీజేపీ బలం పెరిగిందా లేదా అన్నది మాత్రం తిరుపతి ఎన్నికలే కొలమానంగా తేల్చబోతున్నాయిట. బీజేపీ పోటీ చేసి గణనీయమైన ఓట్లు కనుక దక్కించుకుంటే రేపటి ఆశాకిరణంగా ఆ పార్టీని భావించి జంప్ చేసేందుకు నేతాశ్రీలు క్యూ కడతారు అంటున్నారు.

అదే శ్రీరామ రక్ష ….

తిరుపతి ఎన్నికల విషయంలో టీడీపీ గట్టి ఆశలేవీ ఇప్పటికైతే పెట్టుకోవడంలేదు. దానికి కారణం అక్కడ పెద్దగా బలం లేకపోవడం. దాంతో గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 2. 28 లక్షలను సగానికి సగం తగ్గిస్తే అదే తమ విజయం అని టీడీపీ భావిస్తోందిట. గతసారి దాదాపుగా అయిదు లక్షల ఓట్లు వచ్చాయి. ఇపుడు ఆ ఓట్లను పెంచుకుంటే చాలు అన్నది టీడీపీ ఎత్తుగడగా ఉంది వైసీపీ మెజారిటీ రెండు నుంచి లక్షకు తగ్గినా చాలు జగన్ పని అయిపోయింది అని చెప్పడానికి టీడీపీ తయారుగా ఉందిట. అదే సమయంలో తన సెకండ్ ప్లేస్ ని కాపాడుకుంటూ వీలైతే బీజేపీని వెనక్కి నెట్టి అయినా ఏపీ రాజకీయాలో తానే ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవడానికి కూదా సైకిల్ పార్టీ ఎత్తులు వేస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News