బాబాయితో కష్టమేనా?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు సొంత ఇంట్లోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తన బాబాయి శివపాల్ యాదవ్ [more]

Update: 2021-03-03 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు సొంత ఇంట్లోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తన బాబాయి శివపాల్ యాదవ్ ను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన ససేమిరా అంటుండటమే ఇందుకు కారణం. రానున్న ఎన్నికలు అఖిలేష్ యాదవ్ కు అగ్ని పరీక్ష. ఒంటరిగానే సమాజ్ వాదీ పార్టీ బరిలోకి దిగుతుందని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. చిన్నా, చితకా పార్టీలు తప్ప పెద్ద పార్టీలను కలుపుకుని వెళ్లమని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

బాబాయి ని బుజ్జగిస్తున్నా…..

సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ కలహాలు తగ్గడం లేదు. సమాజ్ వాదీ పార్టీని సొంతం చేసుకోవడానికి అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలను బాబాయి శివపాల్ యాదవ్ తప్పు పట్టారు. దీంతో ఆయన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆయన పార్టీ పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో బాబాయి పార్టీని కలుపుకుని వెళ్లాలని అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు.

కలసి పనిచేసేందుకు…..

ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అఖిలేష్ యాదవ్ తో కలసి పనిచేసేందుకు శివపాల్ యాదవ్ అంగీకరించడం లేదు. ప్రగతి శీల సమాజ్ వాదీ పార్టీని తన పార్టీలో విలీనం చేయాలని అఖిలేష్ యాదవ్ వత్తిడి తెస్తున్నారు. ములాయం సింగ్ చేత కూడా చెప్పిస్తున్నారు. కానీ శివపాల్ యాదవ్ మాత్రం అఖిలేష్ యాదవ్ ప్రతిపాదనలను అంగీకరించడం లేదు. శివపాల్ యాదవ్ కు కొన్ని ప్రాంతాల్లో పట్టు ఉంది. ఆయన విడిగా పోటీ చేస్తే యాదవ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.

ఒవైసీతో చర్చలు….

అందుకే అఖిలేష్ యాదవ్ పార్టీని విలీనం చేయాలని కొంతకాలంగా శివపాల్ పై వత్తిడి తీసుకువస్తున్నారు. అయితే తాజాగా శివపాల్ యాదవ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. యాదవ + ముస్లిం ఫార్ములా బాగా వర్క్ అవుట్ అవుతుందని అంచానాలో ఉన్నారు. అదే జరిగితే అఖిలేష్ యాదవ్ కు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News