తప్పిదాల ఫలితమేనా…?

ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ రోజురోజుకూ కుదేలవుతుంది. ప్రధానంగా అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై నేతలకు నమ్మకం సన్నగిల్లిపోతున్నట్లుంది. శాసనసభ. ఇటీవల జరిగిన లోక్ సభ [more]

Update: 2019-08-06 18:29 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ రోజురోజుకూ కుదేలవుతుంది. ప్రధానంగా అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై నేతలకు నమ్మకం సన్నగిల్లిపోతున్నట్లుంది. శాసనసభ. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చావుదెబ్బ తినడంతో అఖిలేష్ యాదవ్ పై సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకూ బలపడుతుండటం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

అపజయాలే ఎక్కువగా….

అఖిలేష్ యాదవ్ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత వరసగా అపజయాలే ఎదురవుతున్నాయి. తండ్రి ములాయం సింగ్ పార్టీని స్థాపించి అనేక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. దేశ వ్యాప్తంగా సమాజ్ వాదీ పార్టీకి పేరు ప్రతిష్టలు తెచ్చారు. పటిష్టమైన ఓటు బ్యాంకును ఉత్తర్ ప్రదేశ్ లో ములాయం సింగ్ పార్టీకి వరంగా ఇచ్చారు. కానీ అఖిలేష్ యాదవ్ వరుస రాజకీయ తప్పిదాలతో పార్టీని భ్రష్టు పట్టించారన్న విమర్శలు లేకపోలేదు.

పిల్ల చేష్టలతో…..

అఖిలేష్ యాదవ్ పిల్ల చేష్టలకు కుటుంబంలోనే విభేదాలు తలెత్తాయి. బాబయి శివపాల్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరస అపజయాలతో నిస్తేజంలో ఉన్న పార్టీని బయటపడేసేందుకు ములాయం సింగ్ యాదవ్ ప్రయత్నాలను ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. అందరూ ఒక్కటేనన్న సంకేతాలు వెళితే తప్ప పార్టీ ముందుకు వెళ్లలేదన్నది పెద్దాయన అభిప్రాయం. ఇంకా చర్చలు తొలిదశలోనే ఉన్నాయి.

రంగంలోకి ములాయం…..

ఇవి ఇలా ఉండగానే పార్టీ నుంచి నేతలు వీడుతున్నారు. ఇది కూడా ఆందోళన కల్గించే విషయమే. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు నీరజ్ శేఖర్, సురేంద్రలు పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ములాయం సింగ్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు, సమాజ్ వాదీ పార్టీ కోశాధికారి అయిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సేథ్ రాజీనామా చేయడం పార్టీలో సంచలనం కల్గించింది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతున్నారు. అఖిలేష్ యాదవ్ కారణంగానే వరసగా పార్టీని నేతలు వీడుతున్నారన్నది వాస్తవం. మరి ములాయం ఇప్పటికైనా రంగంలోకి దిగి పార్టీ నేతలను, క్యాడర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News