అంతా అనుకోకుండానేనా..?

అఖిలప్రియకు రాజకీయాలు అచ్చిరానట్లుంది. అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చీ రాగానే మంత్రి అయ్యారు. ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవలేదు కూడా. తల్లి మరణంతో అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి [more]

Update: 2019-09-07 14:30 GMT

అఖిలప్రియకు రాజకీయాలు అచ్చిరానట్లుంది. అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చీ రాగానే మంత్రి అయ్యారు. ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవలేదు కూడా. తల్లి మరణంతో అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 2014లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తర్వాత మంత్రి పదవి దక్కడంతో తనకు వచ్చిన అవకాశాన్నినిలుపుకోలేక పోయారు. తల్లి, తండ్రి ఏర్పాటుచేసిన పటిష్టమైన క్యాడర్ ను కూడా ఆమె విస్మరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ సమస్యలపై అఖిలప్రియ దృష్టి పెట్టినప్పటికీ, క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని తొలగించలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు.

రాజకీయ వారసత్వాన్ని…..

అయితే 2014 లో తల్లి శోభానాగిరెడ్డి మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ తిరిగి అనుకోకుండానే రాజకీయాల నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. భూమా కుటుంబంలో విభేదాలే ఇందుకు కారణమంటున్నారు. అఖిలప్రియ వివాహం తర్వాత ఈ విభేదాలు మరింత ముదిరాయని చెబుతున్నారు. అఖిలప్రియ భూమా రాజకీయ వారసురాలిగా ఉండటానికి కుటుంబంలో కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో అఖిలప్రియ తన సోదరుడు విఖ్యాత్ రెడ్డికి అయిష్టంగానే రాజకీయ వారసత్వం అప్పగించాల్సి వస్తోందంటున్నారు.

షాక్ లు మీద షాకులు….

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత అఖిలప్రియ కు షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. భూమా అసలైన వారసులు మేమేనంటూ భూమా కుటుంబంలోనే కొందరు అడ్డం తిరిగారు. భూమా కిశోర్ రెడ్డి ఏకంగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆళ్లగడ్డలో భూమా అనుచరులను, సన్నిహితులను కాపాడుకోవాంటే అఖిల ప్రియ వల్ల కాదని కుటుంబ సభ్యులు తేల్చారు. భూమా కుటుంబం రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగాలంటే విఖ్యాత్ రెడ్డికి పగ్గాలు అప్పగించాలని వారినుంచివిన్పిస్తున్న మాట.

వచ్చే ఎన్నికల నాటికి….

అయితే ఇప్పుడు ఓటమి పాలయిన తెలుగుదేశంపార్టీలో ఎవరూ ఉండి కూడా చేసిందేమీ లేదు కాబట్టి అంత స్థాయిలో అఖిలప్రియను తప్పుకోవాలన్న డిమాండ్ రావడం లేదంటున్నారు. ఎన్నికల సమయానికి మాత్రం అఖిలను తప్పించి సోదరుడు విఖ్యాత్ రెడ్డికి టిక్కెట్ ఇస్తేనే గెలుపు సాధ్యమవుతుందని కొందరు బాహాటంగానే చెబుతుండటం విశేషం. అందుకే అఖిలప్రియ ఇటీవల పార్టీకార్యకర్తల సమావేశంలోనూ భూమా వారసుడు విఖ్యాత్ రెడ్డి భూమా వారసుడిగా ప్రకటించడంతో ఆమె వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయదన్నది స్పష్టమయిందంటున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అఖిలప్రియ నేటికీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికలనాటికి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News