అహ‍్మద్ పటేల్ ను అందుకేనా?

అహ్మద్ పటేల్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆంతరంగిక కార్యదర్శి. దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ ఫండ్ ను రైజ్ చేయడం [more]

Update: 2020-03-09 17:30 GMT

అహ్మద్ పటేల్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆంతరంగిక కార్యదర్శి. దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ ఫండ్ ను రైజ్ చేయడం దగ్గర నుంచి ఖర్చు చేయడం వరకూ అంతా అహ్మద్ పటేల్ చేతుల మీదుగానే సాగుతుంది. అహ్మద్ పటేల్ ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖ అహ్మద్ పటేల్ కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆయనను విచారణ చేయాలని నిర్ణయించింది.

తొలి నుంచి ఆయనతో…..

గుజరాత్ కు చెందిన అహ్మద్ పటేల్ తొలి నుంచి మోదీ, అమిత్ షాలకు శత్రువే. కాంగ్రెస అధికారంలో ఉన్నప్పుడు మోదీ, షాలను ఇబ్బంది పెట్టింది కూడా అహ్మద్ పటేల్. ఈ నేపథ్యంలోనే గతంలో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ అహ్మద్ పటేల్ ఎన్నిక కాకుండా మోదీ, షాలు పెద్ద వ్యూహాన్నే రచించారు. అయితే కాంగ్రెస్ పకడ్బందీగా వ్యవహరించడంతో రాజ్యసభకు అహ్మద్ పటేల్ ఎన్నికయ్యారు. ఇప్పుడు తాజాగా అహ్మద్ పటేల్ చుట్టూ ఉచ్చు బిగుసకుంటున్నట్లే కన్పిస్తుంది.

హవాలా రూపంలో….

కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవహారాలను చూసే అహ్మద్ పటేల్ ఇప్పుడు టార్గెట్ అయ్యారు. పార్టీ ఫండ్ కోసం విరాళ రూపంలో సేకరించవచ్చు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు చెక్ రూపంలో గాని, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా కూడా పొందే వీలుంది. కానీ దాదాపు వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీ ఖజానాకు చేరినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. దీనికి అహ్మద్ పటేల్ ను బాధ్యుడిని చేస్తూ నోటీసులు జారీ చేసింది.

విచారణ తర్వాత అనేక మంది…..

గత నెల నుంచి వివిధ రాష్ట్రాల్లో జరిపిన ఐటీ సోదాల్లో హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి నిధులు చేరినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ లావాదేవీలు జరిగినట్లు కనుగొంది. ఈ లావాదేవీలు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు సంబంధించిన కంపెనీలకు నిధులు చేరినట్లు సోదాల్లో వెల్లడయింది. టీడీపీ అధినేత చంద్రబాబు సయితం హవాలా రూపంలో కాంగ్రెస్ కు ఎన్నికల ఫండ్ అందజేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ ను విచారిస్తే దేశంలో అనేక మంది రాజకీయ నేతలు ఐటీ ఉచ్చులో చిక్కుకునే అవకాశమున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అహ్మద్ పటేల్ విచారణలో అనేక కీలక విషయాలు బయటపడటమే కాకుండా, ముఖ్యనేతలు ఇరుక్కునే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.

Tags:    

Similar News