కేసీఆర్ జగన్ భేటీ అపుడేనట… ?

నీటి తగాదాలు ఏపీ తెలంగాణాల మధ్య తాజాగా కొత్త చిచ్చు రేపుతున్నాయి. కృష్ణా నది నీటి కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సై అంటే సై అంటున్నాయి. [more]

Update: 2021-07-23 00:30 GMT

నీటి తగాదాలు ఏపీ తెలంగాణాల మధ్య తాజాగా కొత్త చిచ్చు రేపుతున్నాయి. కృష్ణా నది నీటి కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సై అంటే సై అంటున్నాయి. చుక్క నీరు కూడా పోనివ్వమని అటు కేసీఆర్ గర్జిస్తూంటే ఇటు జగన్ సైతం మా హక్కుల కోసం ఎందాకైనా అంటున్నారు. ఇంకో వైపు చూసుకుంటే కేంద్రాన్ని కూడా తీర్పు చెప్పాలంటూ ఇద్దరూ ముగ్గులోకి లాగుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అందరి మదిలో కలిగే ఒక ఒక ప్రశ్న. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు కూర్చుని మాట్లాడుకోరు అని. ఇద్దరి మధ్య విభేధాలు ఉన్నాయా అంటే మంచి స్నేహితులే అన్నది గత సంఘటనలు తెలియచెప్పాయి. మరి అలాంటపుడు ఎందుకు ఒక సిట్టింగ్ వేయరు అన్నదే పెద్ద డౌట్.

రాజకీయమేనా…?

ఒక వైపు కేసీఆర్ కి టీయారెస్ హుజూరాబాద్ ఎన్నిక అన్నది అత్యంత ప్రతిష్టాత్మకం అయిపోయింది. తమ పార్టీలో రెండు దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన ఈటల రాజేందర్ బయటకు వెళ్ళి తొడగొట్టి మరీ గెలుస్తాను అంటున్నాడు. ఇప్పటికి అరడజన్ సార్లు గెలిచిన ఈటల సొంత ఇలాకా అది. మరో వైపు ఈటల కనుక గెలిస్తే కేసీఆర్ సర్కార్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అన్న మాట ఉంది. దాంతో పాటు టీయారెస్ లో అసమ్మతి రేగి మరింతమంది సవాల్ చేసే చాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఈటలను ఆదిలోనే తెగ్గొట్టాలన్నది కేసిఆర్ పట్టుదల. అందులో భాగంగానే హఠాత్తుగా కృష్ణా నదీ జలాల వివాదం లేవనెత్తారని అంటున్నారు.

వర్కౌట్ అవుతుందా ?

ఇక కేసిఆర్ కైనా జగన్ కైనా కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఇద్దరూ కాంగ్రెస్. బీజేపీలకు కడు దూరం. ఈ జాతీయ పార్టీలు కాలు పెట్టకుండా మరింతకాలం తమ ప్రాంతాలను సాఫీగా ఏలుకోవాలని ఇద్దరూ తాపత్రయపడుతున్న వారే. తెలంగాణాలో బీజేపీ పుంజుకుంటే ఏపీలోనూ ఆ ప్రభావం ఉంటుందని జగన్ కి తెలుసు. అలాగే కాంగ్రెస్ విషయంలోనూ అని చెబుతారు. మరి ఈ రకమైన ఈక్వేషన్స్ వల్లనేనా కృష్టా జలాల వివాదాన్ని హై రేంజిలో రెండు పార్టీలు ముందుకు తెస్తున్నాయి అన్న మాట అయితే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కనుక పూర్తి అయితే కృష్ణా జలాల వివాదం వేడి ఆటోమేటిక్ గా తగ్గుతుంది అంటున్నారు.

అపుడే భేటీ ..?

అదే సమయంలో కేసిఆర్, జగన్ కలసి కూర్చుని కృష్ణా జలాల విషయంలో ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వస్తారని అంటున్నారు. అంటే మరో మూడు నాలుగు నెలల పాటు ఈ వివాదం అలా రేగుతూనే ఉంటుంది అన్న మాట. ఇక ఇప్పటికే అనంతపురం జిల్లా పర్యటనలో జగన్ కేసిఆర్ కి స్నేహ హస్తం అందించారు. నీటి రాజకీయాలు వద్దు, ఎక్కడ ఉన్నా రైతులు అంతా బాగుండలి అని ఆయన పిలుపు ఇచ్చారు. మరో వైపు చూస్తే ఈ మధ్యకాలంలో తెలంగాణా మంత్రుల స్వరం కూడా కొంత తగ్గింది. ఈ క్రమంలో చూసుకుంటే కేంద్రం జోక్యం అవసరం లేకుండానే కేసిఆర్, జగన్ ఈ వివాదానికి ఒక చక్కని ముగింపు ఇస్తారని అంటున్నారు. అదే జరగాలని, ఈ వివాదం పెరిగి పెద్ద కాకూడదని మధ్యలో నలుగుతున్న తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా కోరుకుంటోందిట. అంటే కేసిఆర్ జగన్ మల్టీస్టారర్ ని త్వరలోనే రాజకీయ తెరపైన చూడబోతున్నారన్న మాట.

Tags:    

Similar News