మళ్లీ వ్యతిరేకంగా గళం విప్పుతారా?

బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ మరింత డీలా పడింది. బీహార్ లో కాంగ్రెస్ కనీసంగా నైనా విజయం నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ [more]

Update: 2020-11-19 18:29 GMT

బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ మరింత డీలా పడింది. బీహార్ లో కాంగ్రెస్ కనీసంగా నైనా విజయం నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రచారం చేసిన 12 చోట్ల బీజీపీ అభ్యర్థులు విజయం సాధించడం కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పడుతున్నాయి. బీజేపీ రాహుల్ సభల ఖర్చు భరించాలంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

బీహార్ ఎన్నికల తర్వాత…..

ఇదిలా ఉండగా బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ లో మరోసారి సీనియర్ నేతలు గళం విప్పే అవకాశముంది. కాంగ్రెస్ కు పూర్తి స్థాయి నాయకత్వం కావాలని ఇటీవల గులాం నబీ ఆజాద్ తో సహా అనేక మంది నేతలు సీడబ్ల్యూసీ మీటింగ్ లో కోరిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీకి కూడా లేఖలు రాశారు. దీనిపై అధిష్టానం ఆగ్రహించి బీజేపీ వీరి వెనక ఉన్నట్లు కూడా వ్యాఖ్యానించింది. థిక్కరించిన వారి అధికారాల్లో కోతలు కూడా పెట్టింది.

సీనియర్ నేతలు మరోసారి…..

అయితే బీహార్ ఎన్నికల్లో చెత్త ప్రదర్శనను కాంగ్రెస్ చేయడంతో మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై సీనియర్ నేతలు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. వరస ఓటములతో పార్టీ క్యాడర్ నిరాశలోకి వెళుతుందని, క్యాడర్ ను కాపాడుకోవాలంటే పూర్తి స్థాయి నాయకత్వం కావాలని సీనియర్ నేతలు పట్టుబట్టే అవకాశముంది. దీనిపై మరోసారి లేఖ రాసేందుకు సీనియర్ నేతలు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

మరికొద్ది రోజుల్లో…..

త్వరలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఉత్తమ ప్రదర్శన చేయడం కష్టమే. అందుకే ఈ ఎన్నికల కంటే ముందుగా పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడి స్థానంలో కొత్త అధ్యక్షుడు రావాలని సీనియర్ నేతలు కోరుకుంటున్నారు. త్వరలో వీరంతా సమావేశమై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసే అవకాశముందని తెలిసింది. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో వైఫల్యాన్ని కూడా సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్లే కనపడుతుంది.

Tags:    

Similar News