చేరితే ఎలా?.. చేరుకుంటేనే బెటరా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వైసీపీ ఎన్డీఏ లో చేరుతుందని జోరుగా ప్రచారం జరిగింది. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర [more]

Update: 2020-10-24 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వైసీపీ ఎన్డీఏ లో చేరుతుందని జోరుగా ప్రచారం జరిగింది. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. దీంతో వైసీపీ కేంద్రమంత్రివర్గంలో చేరుతుందా? లేదా? అన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతుంది. కేంద్రమంత్రివర్గంలో చేరితే జగన్ కు ప్రత్యేకంగా చేరే లాభాలు ఏమీ లేవు. కాకుంటే ఇద్దరు, ముగ్గురు మంత్రులు రాష్ట్రానికి నిధులు తేవడంలో కొంత సాయపడతారు.

ప్రత్యేక ప్రయోజనం….

ఇక బీజేపీకి కూడా వైసీపీ మంత్రివర్గంలో చేరడం వల్ల ప్రత్యేకంగా ఒనగూరేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని అంశాల్లో వైసీపీ బయటనుంచి మద్దతిస్తుంది. కాకుంటే మంత్రివర్గం నుంచి ఒక్కొక్కరూ తప్పుకోవడంతో ఇప్పుడు మిత్రపక్షాలు లేకుండా పోయాయి. అదే బీజేపీని బాధిస్తుంది. అందుకే వైసీపీని కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకుని తమకు బలమైన మిత్రుడున్నాడని సంకేతాలు ఇవ్వడానికే ఈ ప్రతిపాదన తెచ్చారంటున్నారు.

చేరడమే బెటర్ అని…..

కానీ వైసీపీలో కొందరు మాత్రం మంత్రివర్గంలో చేరడమే బెటర్ అని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా మోదీ ప్రభుత్వంలో సాధ్యం కాదని, దాని కోసం పట్టుబడుతూ వెళితే రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదని సూచిస్తున్నారు. కనీసం మంత్రివర్గంలో ఉంటే బడ్జెట్ లో గాని, నిధులు తేవడంలో గాని ఏపికి కొంత ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం వైసీపీ కేంద్రమంత్రివర్గంలో చేరకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

మరికొంతకాలం ఇలాగే…….

చంద్రబాబు గతంలో చేరి తిరిగి బయటకు వచ్చినా ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కన్పించిందని, ఏపీలో బీజేపీ పట్ల సానుకూలత లేదని, అందుకే గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. బీజేపీతో నేరుగా చేతులు కలపడం వల్ల కొన్ని వర్గాలను దూరం చేసుకోవాల్సి వస్తుందని, తటస్థులు, మేధావి వర్గాలు సయితం ఈ కలియక ను వ్యతిరేకిస్తాయంటున్నారు.ఏపీ సీఎం జగన్ మాత్రం అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద ఇంకా కొన్నాళ్ల పాటు వైసీపీ, బీజేపీ కలయికపై చర్చ జరుగుతూనే ఉంటుందన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News