ఇక్కడ మాత్రం టీడీపీకి ఫీల్ గుడ్ అనాల్సిందే

రోజులు మారాయి.. రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి. అయితే, కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ద‌శాబ్దాలుగా ఉన్న రాజ‌కీయ ధోర‌ణులు మాత్రం మార‌డం లేద‌నే టాక్ ఉంది. ఇలాంటి [more]

Update: 2020-07-31 12:30 GMT

రోజులు మారాయి.. రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి. అయితే, కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ద‌శాబ్దాలుగా ఉన్న రాజ‌కీయ ధోర‌ణులు మాత్రం మార‌డం లేద‌నే టాక్ ఉంది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గమే విజ‌య‌న‌గ‌రం. ఇక్కడి విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, బొబ్బిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, విజ‌య‌న‌గ‌రం పార్లమెంటుతో పాటు కురుపాం నియోజ‌క‌వ‌ర్గాలు.. రాజుల కుటుంబాల‌కు చెందిన నేత‌ల ఆధిప‌త్యంలో ఉన్నాయి. సుజ‌య కృష్ణరంగారావు సోద‌రులు కానీ, అశోక్‌గ‌జ‌ప‌తిరాజు ఫ్యామిలీ కానీ.. కురుపాంలో వైరిచ‌ర్ల, థాట్రాజ్ కుటుంబాలు ఇక్కడ చ‌క్రం తిప్పినా.. వారు త‌మ‌దైన శైలిలో వ్యవ‌హ‌రించారు.

ప్రజలకు చేరువ కాలేక….

అంటే..కేవ‌లం రాజులుగా కోట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సామాన్య ప్రజ‌ల‌కు చేరువ కాలేక పోయారు. ఎవ‌రైనా ఏదైనా స‌మ‌స్యతో అల్లాడిపోయినా.. వారి వ‌ద్దకు నేరుగా వెళ్లే ప‌రిస్థితి కూడా లేకుండాపోయింది. పోనీ.. ప్రజ‌ల ఓట్లతో గెలిచిన నాయ‌కులు అందుబాటులో ఉన్నారా ? అంటే అది కూడాలేదు. అందుకే వీరి రాజ‌కీయానికి కోట రాజ‌కీయం లేదా రాజుల రాజ‌కీయం అన్న పేరు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స్థిర‌ప‌డిపోయింది. దీంతో ఈ సున్నిత‌మైన అంశాన్ని గ్రహించిన ప్రస్తుత మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌.. ప్రజ‌ల‌కు చేరువ‌య్యారు. రాజుల కోట‌ల‌ను బ‌ద్దలు కొట్టారు. ద‌శాబ్దాలుగా త‌మ అధీనంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో బొత్స త‌న రాజ‌కీయాలు చేస్తున్నారు.

పరిస్థిితిని గ్రహించి….

2004 నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లా అంటే బొత్స కుటుంబం.. బొత్స కుటుంబం అంటే విజ‌య‌న‌గ‌రం జిల్లా అన్న నానుడి స్థిర‌ప‌డిపోయింది. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల బ‌రిలోదిగిన అశోక్‌గ‌జ‌ప‌తి రాజు కుమార్తె ఆదితి గ‌జ‌ప‌తి రాజు.. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 6 వేల మెజారిటీతోనే ఆదితి గ‌జ‌ప‌తి రాజు ఓడిపోయారు. ఈ క్రమంలో ఆమె స్థానికంగా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గ్రహించారు. త‌మకు అనుకూలంగా రాజ‌కీయాలు మార్చుకోవ‌డంపై దృష్టిపెట్టారు. రాజులు, రాజ్యాలు అని చెప్పుకుంటూ పోతే ప్రజ‌లు ఆద‌రించ‌ర‌న్న విష‌యం ఆమె అర్థం చేసుకున్నారు.

సొంత నిధులతో….

ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కూడా ఆదితి గ‌జ‌ప‌తి రాజు నిత్యం ప్రజ‌ల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుల‌కు చేరువ‌య్యారు. ప్రతి ఒక్కరి స‌మ‌స్యను ఓపిక‌గా వింటున్నారు. ఎక్కడ ఏ స‌మ‌స్య ఉంటే అక్కడ‌కు వెళ్తున్నారు. ఎవ‌రు వ‌చ్చినా.. ప‌ల‌క‌రిస్తున్నారు. ఆ ప‌ల‌క‌రింపులో ఎక్కడా గీర్వాణం లేదు.. గౌర‌వం త‌ప్ప. సొంత‌గా ఓ నిధిని ఏర్పాటు చేసి.. ఇటీవ‌ల లాక్‌డౌన్ స‌మ‌యంలో పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పార్టీ పేరుతో పంచారు. అదే స‌మ‌యంలో ప్రతిప‌క్షంగా ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాల్సి వ‌చ్చినా కూడా ఆదితి గ‌జ‌ప‌తి రాజు రోడ్ల మీదికి వ‌స్తున్నారు. అదేవిధంగా పార్టీ త‌ర‌ఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నేత‌ల స‌మ‌స్యల‌ను ప‌ట్టించుకుంటున్నారు.

క్యాడర్ కు చేరువవుతూ…

కార్యక‌ర్తల పిల్లల చ‌దువుల‌కు ఆర్థిక సాయం చేయ‌డం లాంటి ప‌నుల‌తో ఆమె ప్రజ‌ల‌కు బాగా చేరువ అయ్యారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఆదితి గ‌జ‌ప‌తి రాజు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్లలో ప‌ర్యటించి ప్రజ‌ల స‌మ‌స్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల ప‌నితీరును కూడా ఎండ‌గ‌డుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఫీల్ గుడ్ అనే మాట వినిపిస్తున్నద‌నే విష‌యం చంద్రబాబుకు కూడా చేరింది., మొత్తంగా రాజుల కోట‌లో ద‌శ‌దిశ మారుస్తున్న అదితి.. రాబోయే రోజుల్లో మంచి నాయ‌కురాలిగా గుర్తింపు పొంద‌డం ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News