గోరంట్ల పై ఆదిరెడ్డి ప్రతీకారం తీరినట్లేనా …?

వైసీపీ ఒకప్పటి మాజీ ఎమ్యెల్సీ ప్రస్తుత టిడిపి నేత ఆదిరెడ్డి అప్పారావు ఇప్పుడు తూర్పు టిడిపి రాజకీయాల్లో హాట్ టాపిక్. రాజకీయ దురంధరుడు గా పేరొందిన గోరంట్ల [more]

Update: 2021-08-22 09:30 GMT

వైసీపీ ఒకప్పటి మాజీ ఎమ్యెల్సీ ప్రస్తుత టిడిపి నేత ఆదిరెడ్డి అప్పారావు ఇప్పుడు తూర్పు టిడిపి రాజకీయాల్లో హాట్ టాపిక్. రాజకీయ దురంధరుడు గా పేరొందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కే నిద్ర పట్టకుండా చేశారని ఇప్పుడు ఆయనకు తెలియకుండానే పేరు వచ్చేసింది ఆదిరెడ్డి అప్పారావు కు. పార్టీ లో పెను ప్రకంపనలకు తెరతీసిన బుచ్చయ్య రాజీనామా వ్యవహారం లో ఆదిరెడ్డి చేసింది ఏమిటి అనే చర్చ అందరిలో ఆసక్తి రేపుతోంది. పొమ్మనకుండా పొగపెట్టిన వ్యూహంలో ఆదిరెడ్డి అప్పారావు పై చెయ్యి సాధిస్తారా ? లేదు గోరంట్ల తన రాజకీయ చాతుర్యంతో అధిష్టానం బెండు తీసి తానేమిటో నిరూపిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఎవరీ ఆదిరెడ్డి …?

ఆదిరెడ్డి అప్పారావు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్కూల్ నుంచి ఉత్పత్తి అయిన నాయకుడు. ఆయన వెంట సుమారు రెండు దశాబ్దాలు నడిచారు. రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు గోరంట్ల దగ్గరే అభ్యసించారు. ఆయన వినయ విధేయతలు నచ్చే పార్టీ పదవుల్లో మాత్రమే కొనసాగే ఆదిరెడ్డి అప్పారావు కి ప్రమోషన్ కల్పించారు బుచ్చయ్య. ఈ క్రమంలోనే కింజరపు ఎర్రన్నాయుడు తో వియ్యం అందుకున్నారు ఆదిరెడ్డి అప్పారావు. తన కుమారుడు శ్రీనివాస్ కి ఎర్రన్నాయుడు కుమార్తె భవాని తో వివాహం చేయడంతో ఒక్కసారిగా ఒక రేంజ్ లో ఆయనకు పలుకుబడి పెరిగింది. ఆ తరువాత ఆయన సతీమణి ఆదిరెడ్డి వీర రాఘవమ్మను మేయర్ సీటు వచ్చేలా చేయడంలో కానీ రాజమండ్రి కార్పొరేషన్ కు తొలి మేయర్ గా ఆమె గెలుపులో గోరంట్ల చక్రం తిప్పారు. పార్టీ లో ఉన్న సీనియర్ మహిళా నేతలను కాదని ఆదిరెడ్డి అప్పారావు తో ఉన్న సాన్నిహిత్యం తో గృహిణి గా ఉన్న రాఘవమ్మకు మేయర్ టికెట్ కట్టబెట్టారు. అయితే ఇది పార్టీకి తాను చేసిన సేవలకు అధిష్టానం ఇచ్చిన అవకాశం గానే ఆదిరెడ్డి అప్పారావు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తో చెడిన తరువాత చెప్పేవారు.

అవకాశం అందిపుచ్చుకుని …

మేయర్ గా రాఘవమ్మ గెలిచిన తరువాత మూడేళ్ళు గోరంట్ల, ఆదిరెడ్డి అప్పారావుల మధ్య సఖ్యతగానే వ్యవహారం నడిచింది. అయితే ఇద్దరికి ఎక్కడో తేడా కొట్టింది. స్థానికంగా ఆధిపత్యం ఇద్దరిలో ఎవరు గొప్ప అనే దానికి తెరతీసిందని . దాంతో కార్పొరేషన్ లో అవినీతి బాహాటంగా సాగుతోందంటూ నేరుగా గోరంట్ల వ్యాఖ్యలు చేయడం ఆదిరెడ్డి అప్పారావుని టార్గెట్ చేయడం మొదలు అయ్యాయి. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గోరంట్ల వెనుకే ఉంటే తనకు తన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అని భావించిన ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ లోకి జంప్ అయిపోయారు.

వైసీపీ తొలి ఎమ్యెల్సీగా…

ఎర్రన్నాయుడు తో వియ్యం అందుకున్న ఆదిరెడ్డి అప్పారావు వంటి బలహీన వర్గాలకు చెందిన బలమైన ఆర్ధిక పరిపుష్టి ఉన్న నేత కావడంతో వైఎస్ జగన్ ఆయనకు అగ్రతాంబూలమే తొలి ఎమ్యెల్సీ గా కల్పించి ఇచ్చారు. దాంతో సరిపెట్టుకోకుండా రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యే సీటు కూడా తన కుటుంబానికే ఇవ్వాలని జగన్ దగ్గర ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ పెట్టారని ఆయన ప్రత్యర్ధులు చెబుతారు. దీన్ని జగన్ ఒప్పుకోకపోవడం, టిడిపి అధికారంలో ఉండటంతో పాత పరిచయాలతో చంద్రబాబు కు మరోసారి దగ్గరయ్యి ఫ్యాన్ వదిలి సైకిల్ ఎక్కేసారు ఆదిరెడ్డి అప్పారావు. అప్పటి నుంచి రాజమండ్రి అర్బన్ అంటే ఆదిరెడ్డి అన్నంతగా టిడిపి లో హల్చల్ చేస్తూ వస్తున్నారు.

పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో…

ఆయన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, కోడలు భవాని ముగ్గురు పార్టీ లో అన్ని తామై దూసుకుపోతున్నారు. దీనికి తోడు ఏపీ లో టిడిపి గెలిచిన అతికొద్ది నియోజకవర్గాల్లో రాజమండ్రి కూడా కావడంతో చంద్రబాబు, లోకేష్ లు ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చేశారు. నిరంతరం ఆదిరెడ్డి అప్పారావు తో ఉన్న టచ్ గోరంట్ల తో లేకుండా కూడా పోయింది. లోకేష్ తూర్పు పర్యటనల్లో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబమే పెత్తనం చేస్తూ వస్తుంది. ఇవన్నీ గత కొంతకాలంగా మౌనంగా చూస్తూ సహిస్తూ, భరిస్తూ వస్తున్నారు 39 ఏళ్ళ టిడిపి సీనియర్ నేత గోరంట్ల. తనను పార్టీ నుంచి బయటకు స్వయంగా వెళ్ళేలా చేసిన బుచ్చయ్య ను అదే రీతిలో వెళ్ళేలా చేయాలన్న ఆదిరెడ్డి ఎత్తులు తాత్కాలికంగా ఫలించాయనే చెప్పాలి. గోరంట్ల తన నిర్ణయానికే కట్టుబడితే మాత్రం పార్టీ ఆధిపత్య పోరులో ఆదిరెడ్డి అప్పారావు ప్రతీకారం తీర్చుకున్నట్లే.

Tags:    

Similar News