విశాఖ తులసీదళంలో వైసీపీ పాలు …?

విశాఖ జిల్లా రాజకీయాలలో ఆడారి తులసీరావు అన్నాయన పెద్ద కామందు. ఆయన ఏ రాజకీయ పదవీ తనకు తానుగా చేపట్టలేదు కానీ ఆయన చేతుల మీదుగా ఎంతో [more]

Update: 2021-09-24 03:30 GMT

విశాఖ జిల్లా రాజకీయాలలో ఆడారి తులసీరావు అన్నాయన పెద్ద కామందు. ఆయన ఏ రాజకీయ పదవీ తనకు తానుగా చేపట్టలేదు కానీ ఆయన చేతుల మీదుగా ఎంతో మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. విశాఖ రాజకీయాల్లో ఆయన కేంద్ర బిందువుగా ఉంటూ వస్తున్నారు. ఆయనది దశాబ్దాల రాజకీయ అనుభవం. ఇక ఆయన టీడీపీకి అతి సన్నిహితంగా మెలిగినవారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన కొత్తల్లో విశాఖ నుంచి ఆడారి తులసీరావుని తన పార్టీలో చేరమని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. అయితే తులసీరావు టీడీపీకి అండగా ఉంటూ పోటీ మాత్రం చేయలేదు. అలా పసుపు పార్టీతో ఆయనది విడదీయని బంధమైంది.

కేరాఫ్ విశాఖ డైరీ…

ఆడారి తులసీరావు అంటే విశాఖ డైరీ అనే చెప్పాలి. ఆయన విశాఖలో క్షీర విప్లవమే తీసుకువచ్చారు. విశాఖ డైరీని వేల కోట్లకు పడగలెత్తించారు. విశాఖ డైరీది నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం. ఏపీలో ఎక్కువ కాలం టీడీపీ అధికారంలో ఉండడంతో ఆయన పాల వ్యాపారానికి కూడా ఎటువంటి ఢోకా లేకుండా పోయింది. ఈ ప్రైవేట్ సహకార సంస్థ ద్వారా ఆయన ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్థానానికి చేరుకున్నారు. దాంతో రాజకీయంగా కమాండ్ సాధించారు. అయితే ఇపుడు ఆయన డైరీకే ముప్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు.

పాల వెల్లువలో పడి ….

ఏపీలో జగన్ సర్కార్ అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. అమూల్ సంస్థ పోటీగా ఉంటే ఇతర ప్రైవైట్ డైరీలకు దెబ్బ పడడం ఖాయం. ఎందుకంటే ప్రభుత్వం అమూల్ వెనకాల ఉంది. ఇక వివిధ జిల్లాలకు పాకిన అమూల్ పాల వ్యాపార విస్తరణ ఇపుడు విశాఖ సాగర తీరానికి కూడా చేరుకుంది. అయితే ఇదే జిల్లాలో ఎన్ని ఇతర పాల సంస్థలు వచ్చినా విశాఖ డైరీదే ఆధిపత్యం, నూటికి తొంబై శాతం వాటా దానిదే. ఇపుడు అమూల్ విశాఖలో ప్రవేశిస్తోంది. అమూల్ కి పాలు పోసే రైతులను సమకూర్చిపెట్టాలని వైసీపీ నేతలకు ఆదేశాలు వెళ్లాలి. ఇప్పటిదాకా వారంతా విశాఖ డైరీకే తమ పాలను అమ్ముతున్నారు. పాల రైతులు కనుక జగనన్న పాల వెల్లువ పధకానికి ఆకర్షితులై అమూల్ వైపు టర్న్ అయితే ఆ మేరకు విశాఖ డైరీకే నష్టం వస్తుంది.

పాల సామ్రాజ్యానికి చెక్ …

విశాఖ డైరీ ఇప్పటికీ లీటర్ పాలకు రైతుల వద్ద ఇస్తున్నది అతి తక్కువగానే ఉందని గగ్గోలు ఉంది. ఇపుడు దాని కంటే ఎక్కువ మొత్తంలో అమూల్ రైతులకు చెల్లిస్తామని అంటోంది. దాంతో చాలా మంది ఈ వైపుగా వచ్చినా ఆశ్చర్యం లేదు. అదే కనుక జరిగితే జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా సాగిస్తున్న ఆడారి తులసీరావు అతి పెద్ద పాల సామ్రాజ్యానికి ఎక్కడికక్కడ బ్రేకులు పడిపోతాయి. దాంతో పాటే ఆయన ఆర్ధిక పునాదులు, రాజకీయ పెత్తనం కూడా నేలకు దిగిపోతాయి. ఇక్కడ చిత్రమేంటి అంటే ఆడారి కుమార్తె పిళ్ళా రమాదేవి, కుమారుడు ఆనంద్ ఇద్దరూ వైసీపీలోనే ఉన్నారు. కూతురు ఎలమంచిలి నుంచి మునిసిపల్ చైర్ పర్సన్ గా ఉన్నారు. మరి వారు ఏమైనా రాజకీయ పలుకుబడి ఉపయోగించి విశాఖలో అమూల్ పాల వ్యాపార విస్తరణను అడ్డుకుంటారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News