సర్వం ఆదానికి సమర్పయామీ ?

గంగవరం పోర్టు విశాఖలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అయింది. నాడు సీఎం గా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. విశాఖ లో నంబర్ వన్ పోర్టుగా ప్రభుత్వ రంగంలో [more]

Update: 2021-06-06 15:30 GMT

గంగవరం పోర్టు విశాఖలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అయింది. నాడు సీఎం గా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. విశాఖ లో నంబర్ వన్ పోర్టుగా ప్రభుత్వ రంగంలో ఒకటి ఉండగా ప్రైవేట్ లో మళ్ళీ ఎందుకు అన్న ప్రశ్న వచ్చింది. అయితే ఈ పోర్టు స్టీల్ ప్లాంట్ అవసరాలు ఎక్కువగా తీరుస్తుంది అన్న కాన్సెప్ట్ తో ఏర్పాటు చేశారు. పైగా స్టీల్ ప్లాంట్ మిగులు భూముల నుంచి రెండు వేల ఎకరాలను కూడా తీసుకుని మరీ కేటాయించారు. గంగవరం పోర్టుని డిజైన్ చేసింది డీవీఎస్ రాజు కన్సార్టియం. గంగవరం పోర్టు లో మేజర్ షేర్ వారిదే. అంటే 58 శాతం పైగా వారికే వాటాలు ఉన్నాయి. ఇక మరో 31 శాతం తో విండీ లేక్ ‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌ ఉంది.

పొర్టులకే పెద్దన్నగా …;

ఇక దేశంలో ఇపుడు నయా కార్పోరేట్ శిఖరంగా ఆదానీ పేరు వినిపిస్తోంది. పోర్టు రంగంలో ఆదానీ ఏకస్వామ్యమే కొనసాగుతోంది. అందులో భాగంగా ఏపీలో చాలా పోర్టులు వారి ఖాతాలోకే వెళ్తున్నాయి. ఇక విశాఖలో గంగవరం పోర్టుని కూడా ఆదానీ సంస్థ కొనేసింది. నూటికి తొంబై శాతం వాటాలు ఉన్న డీవీఎస్ రాజు కన్సార్టియం తో పాటు విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి కూడా భారీ మొత్తాలను ఇచ్చి మరీ టోటల్ వాటాలను తీసుకుని గంగవరాన్ని తన పరం చేసుకుంది. ఇక మిగిలింది రాష్ట్ర ప్రభుత్వ వాటా పది శాతం. దాన్ని కూడా విక్రయించడానికి ఏపీ ప్రభుత్వం రెడీగా ఉందని తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవెల్ లో…?

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం లాంచనమే. అతి త్వరలోనే ఏపీ సర్కార్ వాటాలు కూడా ఆదానికే దక్కబోతున్నాయి. అంటే నూటికి నూరు శాతం గంగవరం పోర్టు తొందరలోనే ఆదానీ గ్రూప్ పరం కాబోతోంది అన్న మాట. ఆ దిశగా ఆదానీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పోర్ట్ రంగంలో పాన్ ఇండియా లెవెల్ లోనే ఆదాని దిగ్గజం కాబోతోంది అన్నమాట. ఇక విశాఖలో చూసుకుంటే ఏడాదికి 6.7 కోట్ల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో కార్గో పోర్టుగా గంగవరం నిలుస్తోంది. అంటే వ్యూహాత్మకైన ప్రదేశంలోనే ఆదానీ జెండా పాతేసింది అని అర్ధమవుతోంది అంటున్నారు.

అటునుంచి అలా …?

విశాఖ పోర్ట్ ట్రస్ట్ నాడే గంగవరం పోర్టుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ ఏవో విసృత ప్రయోజనాలు పేరు చెప్పి కధ నడిపించారు. ఇపుడు ఆదానికీ మొత్తం దాసోహం అంటున్నారు. ఆదాని బిగ్ షాట్. దాంతో ఇప్పటికే గంగవరం పోర్టుతో ఇబ్బందులు పడుతున్న విశాఖ పోర్టుకు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది అంటున్నారు. రానున్న రోజుల్లో ఆదానీ దూకుడు మామూలుగా ఉండదని, గంగవరం పోర్టు ఆపరేషన్ తో విశాఖ పోర్టు కుదేల్ అయినా ఆశ్చర్యం లేదు అన్న మాట ఉంది. ఈ లోగా కాగల కార్యం తీర్చినట్లుగా స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేట్ పరం చేసి ఆదానికే అప్పగిస్తే ఇక తిరుగులేని విజేత అవుతుంది అని కూడా అంటున్నారు. మొత్తానికి సర్వం ఆదానికే సమర్పయామీ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న స్పీడ్ తో విశాఖలో ప్రభుత్వ రంగం ఢమాల్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News