అచ్చెన్నకు ఫ్యాన్ గాలి బాగా తగులుతోందిగా ?

బలవంతుడు అయిన శత్రువు ఉంటే పక్కలో పామును పెట్టుకున్నట్లే అని మహాకవి శ్రీనాధుడు ఏనాడో ఒక పద్యంలో అంటాడు. రాజకీయాల్లో చాలా మందికి రాత్రులు నిద్ర పట్టదు. [more]

Update: 2020-12-30 14:30 GMT

బలవంతుడు అయిన శత్రువు ఉంటే పక్కలో పామును పెట్టుకున్నట్లే అని మహాకవి శ్రీనాధుడు ఏనాడో ఒక పద్యంలో అంటాడు. రాజకీయాల్లో చాలా మందికి రాత్రులు నిద్ర పట్టదు. దానికి కారణం బ‌లమైన ప్రత్యర్ధులు తమ సత్తా చాటుతూ సవాళ్ళు చేయడమే. అయితే కొంతమందికి మాత్రం ఆ బాధ అసలు ఉండదు, ఒక శత్రువు ఉంటే ఇబ్బంది కానీ నలుగురైదురుగు ఉంటే వారిలో వారే కొట్టుకుంటారు. దాంతో హాయిగా కంటినిండా నిద్రపోవచ్చు. మరి నక్కను తొక్కి లక్కుని పట్టేసిన కింజరాపు అచ్చెన్నాయుడుకు ఇపుడు టెక్కలిలో అలాగే ఉందిట‌ పొలిటికల్ సీన్.

టెక్కలిలో వర్గ పోరు….

ఏపీలో కచ్చితంగా గెలిచే సీటు ఏదీ అని టీడీపీ తమ్ముళ్ళను ప్రశ్నిస్తే తడుముకోకుండా ఇపుడు చెప్పే పేరు టెక్కలి అనే. చంద్రబాబు కుప్పం సీటుకైనా డౌట్ ఉందేమో కానీ అచ్చెన్నాయుడుకు మాత్రం ఏ బెదురూ బెంగా అసలు లేవుట. దానికి కారణం టెక్కలి వైసీపీలో వర్గపోరు. అక్కడ మూడు ముక్కలాట యమ రంజుగా సాగుతోంది. టెక్కలి వైసీపీ ఇంచార్జిగా దువ్వాడ శ్రీనుకు బాధ్యతలు అప్పగించారు. అలాగే టెక్కలిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పేడాడ తిలక్ ని కాళింగ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. ఇక అదే ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కూడా జగన్ గట్టి హామీని ఇచ్చారు. ఇక టెక్కలి వైసీపీలో అంతా సెట్ అయిందని ఎవరైనా భావిస్తే అదే తప్పు. ఈ వర్గ పోరు మరింత రాజుకుంటోంది కానీ ఆగడంలేదు.

కొట్టుకుంటున్నారుగా…

కాళింగ కార్పోరేషన్ చైర్మన్ గా తిలక్ ప్రమాణం చేశాక ఘన సన్మానం చేద్దామని ఆయన వర్గీయులు తలపోశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వర్గం మాత్రం మొదట అంగీకరించి తరువాత నో చెప్పింది. దాంతో అది ఆగిపోయింది. ఈ పరిణామాలతో మళ్ళీ తిలక్ శ్రీనివాస్ వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. ఇక కిల్లి కృపారాణి అయితే పూర్తిగా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. నిన్నటి వరకూ దువ్వాడ దూకుడుతో అచ్చెన్నాయుడు సీటుకు ఎసరు తప్పదు అని అంతా భావించారు కానీ ఇపుడు చూస్తూంటే మూడు వర్గాల మధ్యన గొడవలతో అచ్చెన్నాయుడుకు పని సులువు చేశారని అంటున్నారు.

గెలుపు గ్యారంటీ అట….

ఇవన్నీ ఇలా ఉంటే టెక్కలిలో అచ్చెన్నాయుడు మీద 2014 ఎన్నికల్లో దువ్వాడ శ్రీను వైసీపీ తరఫున టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 లో తిలక్ పోటీ చేసి ఓడారు. ఇపుడు 2024లో దువ్వాడ శ్రీనుకు టికెట్ ఖాయమని అంటున్నారు. ఇప్పటి నుంచే వర్గ పోరుతో క్యాడర్ విడిపోయిన పార్టీలో శ్రీను గెలుపునకు ఎంతవరకూ మిగిలిన వర్గాలు పనిచేస్తాయన్నది పెద్ద సందేహమే అని అంటున్నారు. టెక్కలిలో దువ్వాడ అచ్చెన్నాయుడును సవాల్ చేసే స్థాయిలో ఉండాలంటే ముందుగా గ్రూపులన్నీ ఒక్కటి కావాలి. టెక్కలిలో అచ్చెన్న ఈసారి గెలవకూడదు అని జగన్ పై నుంచి ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ సర్దిచెబుతున్నా కూడా ఎవరికి వారు కుంపట్లు పెట్టుకుని అచ్చెన్నాయుడుకు జై అంటూంటే ఇక జగన్ మాటకు విలువేముంది అని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News