వైఎస్ పై ఉండవల్లి సంచలన పుస్తకం … ?

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ కెవిపి రామచంద్రరావు అయితే వీరిద్దరికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. చక్కని వాగ్ధాటి అంతే చక్కని [more]

Update: 2019-05-13 03:30 GMT

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ కెవిపి రామచంద్రరావు అయితే వీరిద్దరికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. చక్కని వాగ్ధాటి అంతే చక్కని రచనా వ్యాసంగం ఉండవల్లి సొంతం. ఆయనకు గాడ్ ఫాదర్ వంటి వైఎస్ తో సాగిన రాజకీయ అనుబంధాల్లో అనేక మరచిపోలేని అనుభవాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పుడప్పుడు అరుణ కుమార్ ప్రస్తావించినా తెరవెనుక జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలు ఆయన జ్ఞాపకాల్లో అలానే ఉండిపోయాయి. వైఎస్ మరణానంతరం ఆయనపై అనేక పుస్తకాలు వచ్చాయి. ఇటీవల యాత్ర పేరిట సూపర్ హిట్ అయిన సినిమా కూడా వచ్చింది. ఇవన్నీ అలా ఉంచితే ప్రజల్లో వైఎస్ పట్ల వున్న క్రేజ్ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఇప్పటికి ఆసక్తికరమే. దాంతో తన అనుభవాలు, జ్ఞాపకాలతో ఒక కొత్త పుస్తకానికి ఉండవల్లి రూపకల్పన చేశారు. ఎన్నికలు అయ్యే వరకు ఎక్కడ మాట్లకూడదని అనుకున్న ఉండవల్లి ఈ ఖాళీ సమయంలో వైఎస్ తో అనుబంధాల పుస్తకానికి ప్రాణం పోశారు. ఎమెస్కో పబ్లికేషన్స్ నేతృత్వంలో విడుదల కానున్న ఈ పుస్తకాన్ని ఈనెల 14 న హైదరాబాద్ దసపల్లాలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ విచ్చేస్తున్నారు.

ఎవరికి తెలియని విశేషాలు ….

పోలవరం ప్రాజెక్ట్ అనుమతుల కోసం వైఎస్ఆర్ చేసిన కృషి, ఉండవల్లి అరుణ కుమార్ కు ఇచ్చిన డైరెక్షన్ లు ఈ పుస్తకంలో హైలెట్ అనే చెప్పాలి. అలాగే వైఎస్ కోపంతో ఢిల్లీ లో తన ప్లాట్ లో ఉండవల్లి సూట్ కేస్ బయట పెట్టి ఖాళీ చేయించడం అందర్నీ కడుపుబ్బా నవ్వించనున్న అంశం. హిందూ మత విశ్వాసాలపై వైఎస్ కు వుండే నమ్మకాలు, తనను నమ్ముకున్న వారిపట్ల ఆయన చూపించే ప్రేమ , ఆప్యాయత వారికోసం ఆయన చేసే సాహసాల సంఘటనలు ఉండవల్లి మాటల్లో చదివితే అద్భుతమే అనిపించక మానవు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి దారితీసిన నేపథ్యం, రాజీవ్ గాంధీ అనువాదకునిగా వైఎస్ అందించిన ప్రోత్సాహం, వైఎస్ ఘోస్ట్ రైటర్ గా తెరవెనుక ఉండవల్లి రచనావ్యాసంగం అన్ని ఇందులో పూసగుచ్చినట్లు చెప్పారు అరుణ కుమార్.

రెండోసారి బలవంతంగా …

ఎంపిగా ఓడిపోయేలా నా పరిస్థితి వుంది పోటీ చెయ్యను మొర్రో అన్నా ఉండవల్లి కి సీటు ఇప్పించి గెలిపించిన వైఎస్ ఆ సందర్భంలో ఆయనతో జరిగిన సంవాదం ఆ తరువాత దొమ్మేరు లో సోనియా గాంధీ సభ లో జరిగిన పరిణామాలు, పోలవరం ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతుల కోసం కరుణానిధి ని ప్రసన్నం చేసుకోవడం రాజీవ్ సభల్లో వైఎస్, ఉండవల్లి అనుభవాలు గుదిగుచ్చి చెప్పారు అరుణ కుమార్. తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవాలు మాజీ సిఎం కోట్ల వంటివారితో ఎదురైన ఛీత్కారాలు పార్లమెంట్ లో సత్యం రామలింగ రాజుపై చర్చ, అసెంబ్లీలో ఉండవల్లి అంబేద్కర్ ను అవమానించలేదంటూ అరుణ కుమార్ కి మద్దతుగా వైఎస్ చేసిన ప్రసంగం, రామోజీ రావు తో మార్గదర్శి చిట్స్ పై కేసు వంటివి ఈ పుస్తకానికి వన్నె తెచ్చేవే.

వైఎస్ కు కన్నీళ్లు పెట్టించిన ఉండవల్లి ….

గుండెతో ఆలోచించి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వైఎస్ కు ఉండవల్లి చెప్పిన జరిగిన కథ ఒకటి కన్నీరు పెట్టించింది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన సంఘటన ను లంచ్ టైం లో ఒక సందర్భంలో ఉండవల్లి వైఎస్ కు వినిపించారు. ఆ కథ విన్న వైఎస్ కు కన్నీళ్ళు ఆగలేదట. ఇంతకీ ఉండవల్లి ఏమి చెప్పారు ఎందుకు వైఎస్ కు ఏడుపు వచ్చింది ? ఇలాంటివన్నీ అరుణ కుమార్ తన పుస్తక రూపంలో రచించారు. ఇక ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్ల ఆలోచన వాటిపై విపక్షాల విమర్శలు ఆసక్తికరంగా సాగాయి. స్వయంగా తన కుమారుడిపై విపక్షాలు చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ తీసుకున్న సంచలన నిర్ణయాలు, అందులో తనపాత్ర ఉండవల్లి ఉత్కంఠ భరితంగా తన రచన ద్వారా చాటి చెప్పారు. వైఎస్ మహానాయకుడిగా ఎందుకు ఎదిగారు ? ఆయన ప్రయాణంలో ఆటుపోట్లు కెవిపి నిర్వహించిన పాత్ర వంటివన్నీ ఈ పుస్తకానికి వన్నె తెచ్చేవని చెప్పొచ్చు.

Tags:    

Similar News