ఊపిరి తీస్తున్న కరోనా…ఉప ఎన్నికలు తప్పవుగా…?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా ఉప ఎన్నికలు జరిగిన సమయం 2004 నుంచి 2014 అని చెబుతారు. ఆ పదేళ్ల కాలంలో అటు తెలంగాణా ఉద్యమం, [more]

Update: 2021-05-11 15:30 GMT

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా ఉప ఎన్నికలు జరిగిన సమయం 2004 నుంచి 2014 అని చెబుతారు. ఆ పదేళ్ల కాలంలో అటు తెలంగాణా ఉద్యమం, మరో వైపు జగన్ వైసీపీ ఆవిర్భావంతో తొడగొట్టి మరీ ఉప ఎన్నికలు తెచ్చేవారు. దాంతో అటు టీయారెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు చేస్తూ ఉద్యమాన్ని వేడెక్కిస్తే ఇటు సీమాంధ్రలో జగన్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుని రాజీనామాలు చేయించి మరీ ఉప ఎన్నికలు తెచ్చి పెట్టేవారు. ఇక 2014 నుంచి 2019 మధ్యన చూస్తే ఏపీలో ఒకే ఒక ఉప ఎన్నిక నంద్యాలలో మాత్రమే జరిగింది. తెలంగాణాలో కూడా పెద్దగా ఉప ఎన్నికలు నాడు జరగలేదు.

ఉప ఎన్నికలేనా..?

ఇక 2019 నుంచి చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయినట్లుగా ఉంది. అనూహ్యంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దానికి బలి అయిన వారిలో ఎక్కువగా ప్రజా ప్రతినిధులు ఉంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఏపీలో తిరుపతి లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది కరోనాతో మరణించారు. దానికి తాజాగా ఉప ఎన్నిక జరిగింది. ఇక తెలంగాణాలో ఇద్దరు టీయారెస్ ఎమ్మెల్యేలు కరోనా కాటుకు బలి అయ్యారు. అలా దుబ్బాక, నాగార్జుసాగర్ ఉప ఎన్నికలు జరిగాయి. ఈలోగా ఏపీలో కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కూడా కరోనా తోనే మరణించారు. దానికి ఇపుడు ఉప ఎన్నిక అనివార్యం అయింది.

లోకల్ బాడీస్ లోనూ ..?

ఇక లోకల్ బాడీస్ కి రెండు నెలల క్రితం ఎన్నికలు జరిగితే చాలా మంది గెలిచారు. అందులో కూడా ఇపుడు పలువురు కరోనాతో తనువులు చాలిస్తున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ 31వ వార్డుకు చెందిన కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. మరో వైపు వైసీపీకి చెందిన 61వ‌ వార్డుకు చెందిన కార్పొరేటర్ దాడి సూర్యకుమారి అకాల మరణంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరగనుంది. అలాగే గుంటూరు నగర పాలకసంస్థకు చెందిన వైసీపీ కార్పొరేటర్ కూడా ఈ మధ్యన కరోనాతో బలి అయ్యారు. అక్కడా ఉప ఎన్నిక జరిగే వీలుంది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో పంచాయతీల వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా కరోనా తో మృతి చెందిన చోట్ల కూడా ఉప ఎన్నికలు తప్పనిసరిగా జ‌రగనున్నాయి.

దారుణమే …?

నిజానికి కరోనా అన్నది ప్రపంచ మానవాళికి పెను ముప్పుగా పరిణమించింది. అదే సమయంలో రాజకీయ నాయకులకు అది అతి పెద్ద సమస్యగా మారుతోంది. రాజకీయ నాయకులు ప్రజలతో నిరంతరం అనుబంధం కలిగి ఉంటారు. కరోనా లాంటి విపత్తు వేళ వారు మరింతగా జనాల వద్దకు వెళ్తూండాలి. ఈ విధి నిర్వహణలోనే వారు కరోనా కాటుకు గురి అవుతున్నారు. కేవలం ఏపీకి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలలో కరోనా మరణాలలో ఎక్కువగా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. దాంతో ఈ అయిదేళ్ల కాలంలో భారత దేశాన జరిగే ఉప ఎన్నికలు కొత్త రికార్డునే సృష్టిస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News