Be Alert : ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇంకా వాడుతున్నారా..రూ.5వేలు కట్టాల్సిందే

ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించే వీధి వ్యాపారులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు.

Update: 2022-12-01 11:42 GMT

single use plastic

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై భారీ జరిమానాలు విధించేలా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించే వారే వ్యయాన్ని కూడా భరించాలన్న సూత్రం ఆధారంగా సరికొత్త జరిమానాలను విధించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించే వీధి వ్యాపారులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తి, దిగుమతిపై తొలిసారి పట్టుబడితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితో రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిల్వఉంచినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. సీజ్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేజీకి రూ.10 చొప్పున అదనపు జరిమానా విధిస్తారు. వివిధ సంస్థలు, షాపింగ్ మాల్స్ లలో ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడితే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకూ జరిమానా వడ్డింపులు ఖాయం.



Tags:    

Similar News