సభలో ప్రతిపక్షానికి 3 నిమిషాలే !

Update: 2016-03-28 19:17 GMT

కె చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా తెలంగాణలో తెలుగు దేశం పార్టీ (టిడిపి) కుదేలు కాగా, ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో గొంతు వినిపించవలసిన బాధ్యతను రేవంత్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. రేవంత్‌తో పాటు సండ్ర, ఆర్. కృష్ణయ్య మాత్రమే తెలుగు దేశం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చ జరుగుతున్న వేళ, రేవంత్ రెడ్డికి చర్చలో పాల్గొనేందుకు మూడు నిమిషాలు మాత్రమే అవకాశం లభించింది. ఆపై స్పీకర్ మధుసూదనాచారి మైక్ కట్ చేసేశారు. మిగతా వాళ్లకు అవకాశం ఇవ్వాల్సి ఉందని, మీరు సబ్జెక్ట్‌లో ఉన్నంత వరకూ మాట్లాడనిచ్చామని, ఇక కూర్చోవాలని ఆయన అన్నారు. ఈ సమయంలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పెద్దగా అరవడం వినిపించింది. రేవంత్ కేకలను పట్టించుకోని స్పీకర్ మరో సభ్యుడి పేరు పిలిచారు. తనకు ఇచ్చిన సమయంలోనే టిఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఏ పారిశ్రామికవేత్తకు ఎంత భూమి, ఎంత రేటుకు ఇచ్చారన్న విషయాన్ని సభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత పారిశ్రామికవేత్తలకు కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని రేవంత్ ఆరోపించారు.

Similar News