వదంతులను నమ్మవద్దన్న చంద్రబాబు

Update: 2017-07-31 02:53 GMT

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి కుదిస్తారని వస్తున్న వార్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమది ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమని చంద్రబాబు నాయుడు తెలిపారు. పదవీవిరమణ వయోపరిమితి 58 నుంచి 60 సంవత్సరాలకు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఆయన అన్నారు. 43 శాతం ఫిట్‌మెంట్, ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేశామని సీఎం తెలిపారు. ఉద్యోగులు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో భాగస్వామ్యమైన పరిస్థితులు మరిచిపోలేమని.. వారికి ఎంత చేసినా సరిపోదని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న తమ ప్రభుత్వం వారికి ఇబ్బందులు ఎలా కలగచేస్తామని సీఎం అన్నారు. వయోపరిమితి విషయంలో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, దీన్ని కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేసి రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

Similar News