టీడీపీ ఎమ్మెల్యేను వదల బొమ్మాళి అంటున్న బీజేపీ నేత ఎవరు?

Update: 2017-01-30 03:30 GMT

విశాఖలో వెయ్యి ఎకరాలను బడా బాబులు దోచుకున్నారా? అవుననే అంటున్నారు ఈ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖలోని వెయ్యి ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఆయన ఈమేరకు మున్సిపల్ మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని కోరారు. ల్యాండ్ పూలింగ్ అక్రమాలను వెంటనే అరికట్టకుంటే రైతులు పెద్దయెత్తున నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖలో ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఆశ్రయించగా...మరొకరు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణకు చెంతకు చేరారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. తన నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకుంటున్నారని బండారు ఆరోపించారు. అయితే విష్ణుకుమార్ రాజు దీన్ని వదిలేలా లేరు. మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించకుంటే తర్వాత ఏం చేయాలో తనకు తెలుసునని ఆయన అంటున్నారు. మొత్తం మీద విశాఖలో తెలుగు తమ్ముళ్లు, కమలనాధుల మధ్య వార్ స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు.

Similar News