ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను పొగిడారు. కేసీఆర్ అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. కేటీఆర్ ను కూడా గవర్నర్ పొగిడారు. కాంగ్రెస్ తో సహా సీపీఐ నేతలు గవర్నర్ కామెంట్స్ ను తప్పుపడుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్యం నీరుగారిపోతుందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ ను, కేటీఆర్ లపై గవర్నర్ పొగడ్తలు హాస్యాస్పదమన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రజా సమస్యలను వదిలిపెట్టి ప్రభుత్వాన్ని పొగడటమేమిటని ప్రశ్నించారు.
అలాగే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ ఆలీలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గవర్నర్ తన హోదాను మరిచిపోయి ముఖ్యమంత్రిని, మంత్రిని పొగడటం సరికాదని వారు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి.......ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాలరాసి ఇతర పార్టీల సభ్యుల్ని తమ పార్టీలో కలుపుకున్న విషయం గవర్నర్ కు గుర్తుకు రాలేదా అని వారు ప్రశ్నించారు. పొగడ్తలతో ముంచెత్తే కంటే.......ప్రజాసమస్యలపై గవర్నర్ దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.