డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు, కర్నూలు, కడపల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలవ్వడంపై జగన్ ఏపీ అసెంబ్లీ వద్ద స్పందించారు. ఎన్నికల్లో డబ్బు తో విజయం ఎలా సాధించవచ్చో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు జగన్. ఎమ్మెల్యేలను, స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించామని టీడీపీ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల్లో తమ పార్టీకే బలమున్నా... టీడీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సహా స్థానిక సంస్థల ప్రతినిధులను కొనుగోలు చేసి గెలివడం కూడా ఒక గెలుపేనా అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని వైసీపీ అధినేత అభిప్రాయపడ్డారు.