పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు స్థానిక టీడీపీ నేతల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ద్వారకా తిరుమల మండలం మారంపల్లి గ్రామంలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తుండగా టీడీపీ నేతలు నిరసన తెలిపారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు పథకాలు బాగా అమలు చేస్తున్నారని, జగన్ అబద్ధాలు చెప్పడానికి వస్తున్నారని గ్రామంలో బ్యానర్లు కట్టారు. పాదయాత్ర వెళ్లే దారిలోని బిల్డింగ్ లపైకి టీడీపీ కార్యకర్తలు ఎక్కి టీడీపీకి, ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. వీటిని జగన్ పట్టించుకోకుండా గ్రామస్థులను పలకరిస్తూ వెళ్లిపోయారు.