మ్యాటర్ వీక్...పబ్లిసిటీ పీక్...

Update: 2018-06-15 07:17 GMT

ఢిల్లీలో బీజేపీ నేతలను తాను కలిశానని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై పీఏసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై లోకేశ్ చేసిన ట్వీట్ ని చేస్తే లోకేశ్ అమాయకత్వాన్ని చూసి జాలేస్తోందన్నారు. అసలు లోకేశ్ అమరికాలోనే చదువుకున్నారా, ఈ ట్వీట్ చూస్తే తనకు అమెరికా యూనివర్సిటీలపై అనుమానం కలుగుతుందన్నారు. శుక్రవారం ఆయన వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...‘‘షటిల్ నుంచి అమెరికా అధ్యక్షుడి ఎన్నిక వరకు అన్నింటిలో ప్రధాన పాత్ర పోషించిన మేధావి చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేశ్ నేర్చుకుంది ఇంతేనా’’ అని ఎద్దేవా చేశారు.

అవసరమైతే నేరుగా కలుస్తా....

ఢిల్లీలోని ఏపీ భవన్ లో వివిధ పార్టీల నేతలు కలవడం సహజమని, తోటి ఎమ్మెల్యేగా ఆకుల సత్యనారాయణను కలిస్తే టీడీపీ నేతలు ఇంతగా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అలా అంటే టీడీపీ విప్ కూన రవికుమార్ ని కూడా అక్కడే ఆలింగనం చేసుకుని మాట్లాడానని, అంటే ఆయన వైసీపీలోకి వస్తున్నట్లా అని ప్రశ్నించారు. తోటి ఎమ్మెల్యేతో కలిసి షాంగ్రిల్లా హోటల్ లో భోంచేస్తే లోకేశ్ ఇంతగా ఎందుకు బయపడుతున్నారని, హోటల్ బిల్లు మీడియాకు చూపించారు. తమకు అర్థరాత్రి చిదంబరాన్ని కలవడం తెలియదని, ఏదైనా ధైర్యంగా చేయడం మాకు రాజశేఖర్ రెడ్డి, జగన్ నేర్పారని పేర్కొన్నారు.

మరి లోకేష్ మాటేంటి...?

తాను తోటి ఎమ్మెల్యేతో కలిసి భోంచేస్తేనే ఇంతలా ప్రచారం చేస్తున్నారని, మరి లోకేశ్ గతంలో మహిళలు, మధ్యంతో ఉన్న లోకేశ్ ఫోటోలను ఏం అనుకోవాలని ప్రశ్నించారు. టీడీపీ సిద్ధాంతమే ఫాసిస్ట్ సిద్ధాంతమని, ఎవరినీ ఎవరూ కలవద్దు, ఒకరి కులం ఇంకో కులంతో కలవద్దు అనేది మీ సిద్ధాంతమన్నారు. ఒక మనిషి కొన ఊపిరితో ఉండి గ్లాసు నీళ్లు అడిగితే.. నీది తెలుగుదేశం పార్టీనేనా అని అడిగే దారుణమైన స్వభావం టీడీపీ నేతలది అని అన్నారు. రాజ్యాంగం, అవినీతి గురించి మీరు టీడీపీ మాట్లాడటం దారుణని పేర్కొన్నారు.23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మ్యాటర్ వీక్...పబ్లిసిటీ పీక్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

Similar News