కేంద్రాన్ని ఇరుకున పెట్టిన మాదకద్రవ్యాలు

Update: 2018-07-16 14:22 GMT

మాదక ద్రవ్యాలను అరికట్టడానికి విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. విధివిధానాలు రూపొందించడానికి నాలుగు నెలల సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో ఇప్పటి వరకు విధివిధానాలు ఎందుకు రూపొందించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

ఎయిమ్స్ వల్లె ఆలస్యం...

ఆగస్టు 31లోపు విధివిధానాలు రూపొందించాలని ధర్మాసనం సూచించగా, కనీసం రెండు నెలల గడువు కోరిన కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటరల్ జనరల్ మణీందర్ సింగ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విధివిధానాలు రూపొందించడంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)సహకారం ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టుకు మణీందర్ సింగ్ తెలిపారు. అయితే, అన్ని రాష్ట్రాలకూ నోటీసులు జారీచేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరగా, విధివిధానాలు రూపొందించిన తరువాత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసే విషయం గురించి ఆలోచిద్దామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది

Similar News