మ్యూజియం దొంగలు వారేనా?

Update: 2018-09-06 03:22 GMT

హైదరాబాద్‌లోని నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడ్డ దొంగలపై పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ దొంగతనం చేసింది ఇద్దరు యువకులని పోలీసులు నిర్ధరించుకున్నారు. సీసీ కెమెరాల్లో ఇద్దరు యువకులు ఎక్కడికెళ్లారనేది తెలడం లేదు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో వీరి కోసం వెతికినా ఫలితం కనిపించలేదు. మ్యూజియం పరిసర ప్రాంతాల్లో బైకుపై చక్కర్లు కొట్టిన దొంగలు.. చివరిసారిగా పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌ వద్ద బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి . అక్కడి నుంచి ఎటు వెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. బైక్‌ నంబరు స్పష్టంగా కనిపించకపోవడంతో సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి ఆధారాలను సేకరిస్తున్నారు.

వెంటిలేటర్ అద్దాన్ని తొలగించి......

సంఘటన జరిగిన రోజు తెల్లవారు జామున 3.20 గంటలకు ఒక దొంగ వెంటిలేటర్‌ అద్దాన్ని తొలగించి మ్యూజియంలో ప్రవేశించగా.. మరో దొంగ పైనే ఉన్నాడు. టిఫిన్‌ బాక్సు, టీ కప్పు, చెంచా ఉన్న అల్మారా తాళాన్ని ఇనుప రాడ్డుతో పగులగొట్టి వాటిని తీసుకున్నారు. అనంతరం అక్కడే ఉదయం 5 గంటల వరకూ ఉండి వచ్చిన దారినే పారిపోయారు. పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో వీరు మసీదు వద్దకు ఎలా వచ్చారని ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల దృశ్యాల పై ఆరాతీస్తున్ణారు . దొంగల్లో ఓ యువకుడు సెల్‌ఫోన్‌ మాట్లాడటంతో సమీపంలోని సెల్‌టవర్ల నుంచి కీలక సమాచారాన్ని తీసుకుని వాటిలో అనుమానిత నెంబర్ల పై ఆరాతీస్తున్నారు. ఇప్పటికే కొంత కీలక సమాచారాన్ని సేకరించి నిందితుల కదలికలు ఫింగర్ ప్రింట్స్ తో గతంలో కేసులు వున్న వారి ఫింగర్ ప్రింట్స్ తో పోల్చి పాత నేరస్తుల పనేనా అన్న అన్న కోనంలో దర్యాప్తు కొనసాగుతుంది.

కర్ణాటక వాసులుగా అనుమానం......

హైదరాబాద్‌లోని నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడ్డ దొంగలు పక్కాగా రెక్కీ చేశాకే విజయవంతంగా చోరీ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితం సందర్శకుల్లా వచ్చి మ్యూజియంలో అణువణువూ పరీక్షించారని తెలిపారు. మ్యూజియంను సందర్శించినప్పుడు ఇద్దరూ ముఖాలకు ముసుగు ధరించారా? గుర్తించకుండా గడ్డం, విగ్గు పెట్టుకున్నారా? వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. మ్యూజియం సిబ్బందిని పరిశీలిస్తున్న క్రమంలో ఒకరి వేలిముద్రలు లభించడం, దొంగతనం జరిగినప్పుడు సెక్యూరిటీ గార్డులు ముందువైపు విధులు నిర్వహిస్తుండడం వంటివి విశ్లేషించి మ్యూజియంలో విధులు నిర్వహించే వ్యక్తులెవరైనా సహకరించి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.సంఘటన జరిగిన రోజు రాత్రి నుంచి సెల్‌ టవర్లు, సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి రెండు ప్రత్యేక బృందాలు ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నారు . మరో రెండు బృందాలు చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మదీనా, ఎంజీబీఎస్‌ వైపు వెళ్తూ అక్కడ రాత్రివేళల్లో విధులు నిర్వహించిన పోలీసులను, ఆటోడ్రైవర్ల నుంచి సమాచారం సేకరించారు. దుండగులు కర్ణాటక వాసులై ఉండొచ్చని దర్యాప్తు బృందం అధికారులకు చెప్పినట్లు సమాచారం. వీటికి సంబంధించి ఒక కీలకాధారం లభిస్తే మొత్తం కేసు వీడిపోతుందని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

Similar News