రేవంత్ కు డబ్బులిచ్చి పంపింది చంద్రబాబు కాదా..?

Update: 2018-07-12 07:37 GMT

ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరినీ చంపిన నేరస్తుడు చంద్రబాబునాయుడు అని తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ... గాలి ముద్దుకృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదని, ఆయన మరణానికి కారణం చంద్రబాబే అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉండి, ప్రజాస్వామ్యం, కులవ్యవస్థ నిర్మూలన గురించి మాట్లాడే పెద్ద మనిషి దళితుడిగా ఎవరు పుట్టాలని కోరుకోరని వ్యాఖ్యానించడం దారుణమన్నారు. 20 ఏళ్ల కింద ఏబీసీడీ వర్గీకరణ పంచాయితీ పెట్టి మాల, మాదిగలు విడిపోయేలా చేశారని ఆరోపించారు. తాను అవినీతి చేయలేదని, కుంభకోణం చేయలేదని, పార్టీకి మచ్చలేదని అయినా తనను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అసలు కుట్రదారుడు చంద్రబాబు నాయుడే అని, రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ఇంటికి డబ్బులు ఇచ్చి పంపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు.

నా వెనుక ఎవరూ లేరు

చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నష్టమే అని, ఆయన సింగపూర్ వెళ్లినందుకే రాష్ట్రంలో వర్షాలు పడ్డాయని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో తన అంత పెద్ద ప్రజాస్వమ్యావాది లేరని చెప్పుకునే చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం పెట్టిన పార్టీని చంద్రబాబు దొంగల పార్టీగా మార్చారని ఆరోపించారు. తన వెనుక ఎవ్వరూ లేరని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన చరిత్ర తనకుందని పేర్కొన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు.

Similar News