మంద కృష్ణా యాది లేదా..?

Update: 2018-11-29 07:59 GMT

నిన్న జరిగిన ఖమ్మం ప్రజాకూటమి సభలో చంద్రబాబు నాయుడును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ పొగడ్తలతో ఆకాశానికెత్తారు. ఏపీలో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు బాగా అమలవుతున్నాయని, మంత్రివర్గంలో మాలమాదిగలకు ప్రాతినిథ్యం కల్పించారని పొగిడారు. అంతకుముందు కూడా చంద్రబాబుతో నవ్వుతూ కరచలనం చేశారు. తర్వాత ఆప్యాయంగా బాబును కౌగలించుకున్నారు. దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదే మంద కృష్ణను రెండేళ్ల కింద కనీసం విజయవాడకు వెళ్లడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతించకుండా మధ్యలోనే అరెస్ట్ చేసి తిరిగి పంపించారు. దీంతో విజయవాడకు వెళ్లాలంటే వీసా కావాలా..? అని ప్రశ్నించి, తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. అంతకుముందు కూడా నారావారిపల్లి పోవాలనుకున్నప్పుడు ఒకసారి, అమరావతిలో మరోసారి కూడా మంద కృష్ణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఖమ్మం సభలో చంద్రబాబును మంద కృష్ణ పొగడటం, ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Similar News