మా ప్రభావం ఏంటో ఇప్పుడు చూపిస్తాం..!

Update: 2018-09-26 07:35 GMT

కొండా దంపతుల ప్రభావం ఏంటో ఇప్పుడు టీఆర్ఎస్ కు చూపిస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బుధవారం కొండా దంపతులు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... తమకు రాజకీయ జన్మను ఇచ్చిన పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ వారు వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తాము రెండు టిక్కెట్లు అడిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము రెండు టిక్కెట్లు అడగలేదని పేర్కొన్నారు. 5 నుంచి 6 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిస్తామని రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రచారపర్వంలోకి కొండా దంపతులు...

కొండా దంపతులు బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా దంపతులపై రాహుల్ గాంధీకి మంచి అభిప్రాయం ఉందన్నారు. వారి ప్రభావంతో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే బాధ్యతలను సైతం కొండా సురేఖకు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ హవా వీస్తోందని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Similar News