తాగితే చంచల్ గూడ తప్పదు….!!!

ఇక మీదట తాగి వాహనం నడపాలంటే జర జాగ్రత్తగా ఉండాల్సిందే. మద్యం మత్తులో వాహనం నడిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు.. ఒక్క ఏడాదిలోనే ఐదు [more]

Update: 2019-01-07 13:46 GMT

ఇక మీదట తాగి వాహనం నడపాలంటే జర జాగ్రత్తగా ఉండాల్సిందే. మద్యం మత్తులో వాహనం నడిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు.. ఒక్క ఏడాదిలోనే ఐదు కోట్ల రూపాయలు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఫైన్ లు విధించడమే కాదు. ఎంతో మంది జైలు పాలయ్యారు కూడా..2018 ఒక్క సంవత్సరంలోనే అయిదు వేల మంది కి పైగా జైలు ఊచలు లెక్కబెట్టారు. ఇక తాగితే ఫైన్, కౌన్సిలింగ్ ఉండదని నేరుగా జైలే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు.

ఐదు వేలకు మంది…..

డ్రంకన్ డ్రైవ్ అంటేనే బెంబెలెత్తిపోతున్నారు వాహనదారులు..వాహనం సీజ్ చేయడం దగ్గర నుంచి జైలుకు పంపించేంత వరకూ పోలీసులు ఎవ్వరిని ఉపేక్షించడం లేదు. ముఖ్యంగా వీకెండ్ లో ఎక్కువ మంది డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడుతున్నారు. పట్టుబడిన వారి వాహనం సీజ్ చేయడం నుండి వారికి కౌన్సిలింగ్ ను మొదలుకుని లైసెన్స్ రద్దు, జైళ్లకు పంపిచేంత వరకు వెనుకాడట్లేదు పోలీసులు. 2018 సంవత్సరంలో డ్రంకన్ డ్రైవ్ లో అనేక మంది పోలిసులకు చిక్కారు. ఇందులో 29 వేలకు పైగా కేసులను నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులు నమోదైన వారిలో సుమారు 5 వేల 4 వందల మందికి పైగా జైలు పాలయ్యారు. ఇందులో ఒక వ్యక్తికి మూడు నెలల పాటూ కోర్టు జైలు శిక్ష విధించగా , 10 మందికి 2 నెలల పాటు శిక్ష పడింది. 2 వేలకు పైగా మద్యం సేవించి వాహనం నడిపిన వారికి 2 రోజుల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. జైలు శిక్ష నిమిత్తం డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారంతా చంచల్ గూడ జైలు కు వెళాల్సిందే.

డ్రైవింగ్ లైసెన్సులూ…

ఇక డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిలో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేశారు పోలీసులు. సుమారు 14 వందల మందికి పైగా డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేశారు పోలీసులు…ఇందులో ఒక వ్యక్తి లైసెన్స్ ను సుమారు 10 ఏళ్ళ పాటూ రద్దు చేయగా, 11 మంది లైసెన్స్ లను 7 సంవత్సరాల పాటూ రద్దు చేశారు పోలీసులు. అలాగే 64 మందికి 5 ఏళ్ళ పాటు లైసెన్స్ రద్దు చేశారు . గత యేడాది నమోదయిన కేసుల్లో 27 వేల కు పైగా చార్జ్ షీట్ దాఖాలు చేశారు పోలీసులు. పట్టుబడుతున్న వారిలో మహిళల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. 2018 సంవత్సరంలో 191 మంది మహిళలు తాగి వాహనం నడుపుతూ పోలిసులకు చిక్కారు.

యువకులూ జాగ్రత్త….

ముఖ్యంగా యూత్ కు ఈ డ్రంకన్ డ్రైవ్ తో చాలా సమస్యలు ఎదురు కానున్నాయి. తాగి వాహనం నడుపుతూ పోలిసులకు పట్టుబడితే వారి పై కేసు నమోదు అవుతుంది.. ఆ కేసు ద్వారా భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వూల సమయంలో పోలీసు కేసు ఉంటే వారికి ఉద్యోగ అవకాశం కష్టమవుతుంది. వీటితో పాటూ పాస్ పోర్ట్ , వీసా ప్రాసెస్ సమయాల్లోనూ ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని యూత్ ను హచ్చరిస్తున్నారు పోలిసులు. 2017 డ్రంకెన్ డ్రైవ్ కేసులతో పోల్చుకుంటే 2018 డ్రంకెన్ డ్రైవ్ కేసులు సుమారు 10 శాతం ఎక్కువగా నమోదు అయ్యాయి. జైలు శిక్ష పడిన వారిలో 2017 లో 4 వేల మంది ఉంటే 2018 లో 5 వేలకు పైగా మందికి జైలు విధించింది కోర్టు . అంటే ఇక మీదట తాగి వాహనం నడిపితే కచ్చితంగా జైలుకే అన్న రీతిలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇక నుండైనా తాగి వాహనం నడపకుండా జాగ్రత్త పడండి అనవసర ఇబ్బందులకు గురి కాకండి అని అంటోంది పోలీసు శాఖ.

Tags:    

Similar News