తెలుగుదేశం పుట్టిందే ఇక్కడ

Update: 2018-05-24 13:43 GMT

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలోనని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. ఇక్కడ పార్టీ బలంగా ఉందని, మరో ఆరునెలల్లో మరింత బలోపేతంగా మారుతుందని, టీడీపీ శ్రేణులు అధైర్యపడొద్దని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణలో కొందరు నేతలు పార్టీని వదిలినా, కార్యకర్తలు మాత్రం టీడీపీని వదలలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కూడా నిధులు ఇవ్వడం లేదని, విభజన హామీలు కూడా అమలు చేయడం లేదన్నారు. జాతీయ స్థాయిలో 2019లో టీడీపీ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. తనకు ప్రధాని పదవిపై ఆశలేదని, 20 ఏళ్ల క్రితమే అవకాశం వచ్చినా వద్దని చెప్పానని స్పష్టం చేశారు. తెలుగువారికి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. ఇక హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు తన మార్కు ప్రసంగం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ ముద్రను ఎవరూ కాదనలేరని, హైదరాబాద్, సికింద్రాబాద్ కి అదనంగా మరో నగరం అవపరముందనే ఆలోచన చేసి సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని తెలిపారు. హైదరాబాద్ లో ఒకప్పుడు మతకల్లోలాలు జరిగేవని, తెలుగుదేశం పార్టీ వాటికి అడ్డుకట్ట వేసి మతసామరస్యం పెంపొందించేలా చూసిందన్నారు.

Similar News